కీరవాణి అనే పేరు ఎందుకు పెట్టారంటే...: కీరవాణి
తన జన్మస్ధలం గురించి చెప్తూ... పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉండే కొవ్వూరు మా స్వగ్రామం. మా తాతగారు మంచి స్థితిమంతులు. అప్పట్లో స్థానికంగా తిరిగే పది, పన్నెండు ప్రైవేట్ బస్సులుండేవి మా తాతగారికి. ఆయనకు ఏడుగురు సంతానం. నాన్నగారు మూడవ కుమారుడు. ఒక అక్క, ఒక అన్న, నలుగురు తమ్ముళ్లు నాన్నగారికి. నాన్నగారి చివరి తమ్ముడే దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్గారు. నాన్నగారికి చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా కళల మీదే మక్కువ ఎక్కువ అన్నారు.
ఇక నాన్నగారు తాను రాసిన కథలతో సినిమాలు తీద్దామని దర్శకత్వం చేసి చేతులు కాల్చుకున్నారు. నిర్మాణ రంగంలో అనుభవం లేక కొంతమంది భాగస్వాములతో కలిసి రెండు, మూడు సినిమాలు తీయడం, అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత 'అర్ధాంగి' అనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం నాన్నగారికి వచ్చింది. నాన్నగారు ఈ మధ్యనే 'చంద్రహాస్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి నంది అవార్డు వచ్చినా పెద్దగా ఆడలేదు.
నాన్నగారు తన పెళ్లి కాకముందు ఒక్కరే మద్రాసు వెళ్లి ఎల్.వి. ప్రసాద్గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఆ రోజుల్లో ప్రసాద్గారికే పెద్దగా పనిలేదు. అప్పుడప్పుడే ఆయన నిలదొక్కుకుంటున్నారు. చేతి నిండా పనిలేకపోవడంతో నాన్నగారికి బోర్ కొట్టి వాపసు వచ్చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎల్.వి. ప్రసాద్గారు అగ్రదర్శకులుగా ఎదిగారు. అక్కడే కొనసాగి ఉంటే ఈ రోజు కె. విశ్వనాథ్గారి సరసనో, బాపుగారి సరసనో నాన్నగారి పేరు కూడా నిలబడి ఉండేదేమో అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












