వర్మ మా గుండెల్లో చిచ్చు రేపుతున్నాడంటూ ఆవేదన
"మేం ఆ సంఘటనని మరచిపోవాలని అనుకుంటుంటే, ఈ సినిమా ద్వారా వర్మ ఆ గాయాన్ని మళ్లీ రేపుతున్నాడు'' అంటూ నీరజ్ గ్రోవర్ కుటుంబం వాపోతోంది.రాంగోపాల్ వర్మ తాజాగా నీరజ్ గ్రోవర్ హత్య ప్రేరణతో బాలీవుడ్లో రూపొందించిన 'నాట్ ఎ లవ్ స్టోరీ' చిత్రంతో ఈ వివాదం మొదలైంది. వర్మ ఈ సినిమా తీయడంతో నీరజ్ కుటుంబం ఆవేదన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఎంటర్టైనింగ్ కంపెనీకి క్రియేటివ్ హెడ్గా పనిచేసిన నీరజ్ని 2008 మే 6న అతని మాజీ గర్ల్ఫ్రెండ్ మరియో మోనికా సుసైరాజ్, నేవీలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న ఆమె బాయ్ఫ్రెండ్ ఎమిలే జెరోమ్ కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ దుర్ఘటన నుంచి ఇప్పటికీ నీరజ్ కుటుంబం తేరుకోలేదు. ఇప్పుడు నీరజ్పై వర్మ సినిమా తీశాడనే వార్త వినగానే నీరజ్ తల్లి నీలమ్ గ్రోవర్ ఆవేదన వ్యక్తం చేసింది. వర్మ ఈ పని ఎందుకు చేశాడని బాధపడింది. నీరజ్ అక్క శిఖ సైతం ఈ సినిమా తీయడానికి వర్మ తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపింది.
అయితే వర్మ వాదన అందుకు భిన్నంగా ఉంది. తాను నీరజ్ కథతో ఈ సినిమా తీయలేదనీ, తన సినిమాకి ఆ సంఘటన కేవలం ప్రేరణ మాత్రమేననీ అంటున్నాడు. "నిజంగా జరిగిన హత్యపై నేను ఎలా సినిమా తీయగలను? నేనేమైనా అక్కడనున్నానా? నిజంగా అప్పుడు ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది. ఆ సంఘటనని నా సొంత మెదడుతో, నాకు తోచిన రీతిలో తెరమీద ఆవిష్కరించానంతే. అంతేకానీ ఇది నీరజ్ కథతో తీసిన సినిమా కాదు'' అని స్పష్టం చేశాడు. ఈ చిత్రాన్ని నెల రోజుల షూటింగ్తో ఆయన పూర్తి చేశాడు. అది ఎప్పుడు విడుదలయ్యేదీ కొద్ది రోజుల్లో తెలియనుంది.


Click it and Unblock the Notifications











