చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నాం.. డైరెక్టర్ మాత్రం సస్పెన్స్.. బడా నిర్మాత క్లారిటీ
మైత్రి మూవీ మేకర్స్ తెలుగు సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. నవీన్ యేర్నేని, రవి శంకర్, చేకూరి మోహన్లు కలిసి ఏర్పాటు చేసిన ఈ బ్యానర్పై ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే మైత్రీ బ్యానర్లో సినిమా చేయాలిని టాలీవుడ్లోని ప్రతి హీరో అనుకుంటారన్న టాక్ కూడా ఉంది.
ఈ సినిమా సంస్థ ఎన్నో భారీ సినిమాలను పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉంది. రానున్న రోజుల్లో మంచి సినిమాలను అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఈ ముగ్గురు నిర్మాతలు. ఇందుకోసం ఎంతో మంది డైరెక్టర్లు, హీరోల కాల్షీట్లు కోరుతుంది. అంతేకాదు, ఖర్చుకు ఏమాత్రం వెనకాడకూడదని కూడా డిసైడ్ అయింది. ఈ విషయాలన్నింటిని సంస్థ స్థాపకుల్లో ఒకరైన నవీన్ యెర్నేరి చెప్పుకొచ్చారు.

తమ సంస్థ ఏ సినిమాలు చేయబోతుంది..? ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు..? రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారు..? అనే విషయాలను ఆయన వెల్లడించారు. ''మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. దీని కోసం కథను కూడా రెడీ చేయిస్తున్నాం. ఇది పూర్తయిన తర్వాత చిరు గారికి వినిపిస్తాం. ఆయనకు ఓకే అయితే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అయితే, దీనికి దర్శకుడు ఎవరు అనేది ఫిక్స్ చేయలేదు'' అని చెప్పుకొచ్చారు నవీన్.
ప్రస్తుతం ఈ సంస్థ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రెడ్'ను నిర్మించింది. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన', నాని 'గ్యాంగ్ లీడర్' సహా పలు సినిమాలను నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్.


Click it and Unblock the Notifications











