మీడియా ముందు కన్నీరు పెట్టిన జై బోలో తెలంగాణ దర్శకుడు శంకర్
తన సినిమా జై బోలో తెలంగాణ సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు పెట్టడంపై దర్శకుడు ఎన్. శంకర్ మీడియా ముందు కన్నీరు పెట్టారు. సెన్సార్ బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలున్నాయని చెబుతున్నారే గానీ ఏ విధమైన అభ్యంతరాలున్నయో చెప్పడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులతో ఆయన మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. సినిమాను ముంబైలోని జాతీయ సెన్సార్ బోర్డుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. మీడియా ముందు శంకర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సాధారణంగా సినిమాలో అభ్యంతరకరమైన దృశ్యాలుంటే తమకు చెప్తారని, వాటిపై చర్చ చేస్తారని, అంగీకారం కుదిరితే వాటిని తొలగిస్తామని ఆయన చెప్పారు. జై బోలో తెలంగాణ విషయంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమున్నాయో, అభ్యంతరకరమైన ఇతర విషయాలేమున్నాయో చెప్పడం లేదని ఆయన అన్నారు. సినిమాలో హింస, అశ్లీలత లేదని, అది రక్తచరిత్ర కాదని ఆయన అన్నారు. కొందరి త్యాగాలను, పేదరికాన్ని, సంస్కృతిని తెరకెక్కించానని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఎవరు ఏ ప్రాంతంవారనేది తనకు తెలియదని ఆయన చెప్పారు. ఒక చరిత్రను తెరకెక్కించానని ఆయన చెప్పారు. ఈ సినిమాలో సందీప్, మీరా నందన్, జగపతిబాబు, స్మృతి ఇరానీ నటించారు. ఉడుగుల వేణు సంభాషణలు సమకూర్చారు.


Click it and Unblock the Notifications











