అందుకే నన్ను విలన్గా చూపించారు: ఎన్టీఆర్ మహానాయకుడుపై నాదెండ్ల భాస్కర్ రావు
Recommended Video

'ఎన్టీఆర్-మహానాయకుడు'లో తనను విలన్గా చూపించడంపై మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు స్పందించారు. వారు పొరపాటు చేశారు.. విలన్ను నాయకుడిగా, నాయకుడిని విలన్గా చూపించారు. ఈ పార్టీ(తెలుగుదేశం) పెట్టింది నేను. అది రామారావుగారికి తెలుసు, వారి పిల్లలకు తెలుసు. అలాంటి నేను విలన్ ఎలా అవుతాను? అని ప్రశ్నించారు.
మనకు ఉన్న 64 కళల్లో సినిమా అనేది అట్టడుగున ఉనన కళ. మన పూర్వీకులు, గ్రంధాలు దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. విదేశాల్లో కూడా సినిమాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. నన్ను విలన్గా చూపించడం చాలా దుర్మార్గమని భాస్కర్ రావు వ్యాఖ్యానించారు.

తండ్రిని చంపిన కొడుకులు అలాగే చేస్తారు
తండ్రిని చంపిన కొడుకులు నన్ను విలన్ అనకుండా ఇంకేం అంటారు? తండ్రిని కావాలని కుట్రపూరితంగా చంపేశారు. ఎందుకంటే ఆమె(లక్ష్మీ పార్వతి) ద్వారా బిడ్డలు పుడితే ఆస్తి ఆమెకే పోతుంది, అందుకే జయకృష్ణ, హరికృష్ణ, బాలయ్య, చంద్రబాబు అంతా కలిసి రామారావు మరణానికి కారణం అయ్యారు, చంద్రబాబు అందిరినీ తన దారిలోకి తెచ్చుకుని ఇదంతా చేయగలిగాడని భాస్కర్ రావు ఆరోపించారు.

రామారావుగారికి, నాకు మధ్య అలాంటి సంభాషణ లేదు
సినిమాలో వాస్తవం చూపించకుండా అవాస్తవాలు చూపించారు. నేను, రామారావు... నువ్వు ఫైలట్, నేను కో ఫైలట్ అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ సంభాషణ ఉన్నట్లు సినిమాలో పెట్టారు. మొట్టమొదట మేము గవర్నమెంట్ ఫాం చేసినపుడు పత్రికల వారు వచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ గా నేను ఆఫీసులో కూర్చున్నాను. పత్రికల వారు నా నుంచి ఏదో ఒక విషయం రాబట్టాలని ప్రయత్నిస్తుంటే... నిబంధనలకు లోబడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. విమానాన్ని పైలట్, కో పైలట్ నడిపించినట్లు మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పాను. అంతే కానీ రామారావు, నా మధ్య అలాంటి సంభాషణ ఎప్పుడూ రాలేదని భాస్కర్ రావు తెలిపారు.

చంద్రబాబు వేసిన పథకమే
రామారావు వద్ద ఉన్న వారిని ఒకరి తర్వాత ఒకరిని బయటకు వెళ్లగొట్టాలనే ప్లాన్ చంద్రబాబు వేశాడు. అందరూ వెళ్లిపోతే రామారావు ఒక్కరే మిగిలిపోతాడు మెగడకాయ పిసకొచ్చు అనే పథకం వేసి నా మీద కుట్ర పన్నాడు. రామారావు అమెరికా వెళుతున్నట్లు నన్ను డబ్బు అడిగారే తప్ప వెళుతున్నట్లు నాకు చెప్పలేదు. మొత్తం బాధ్యత చంద్రబాబుకు అప్పగించారు. ఆ అవకాశాన్ని చంద్రబాబు వాడుకుని నా మీద రామారావుకు వ్యతిరేకత పెరిగేలా చేశాడని తెలిపారు.

అలా నాపై వ్యతిరేకత పెంచారు
రామారావుగారు అమెరికా నుంచి వస్తున్నపుడే... ముఖ్యమంత్రి గండిపేటలోని ఇంటి మెయింటనెన్స్ కోసం డబ్బు సాంక్షన్ చేయాలని చీఫ్ సెక్రటరీ ద్వారా ఓ ఫైనల్ రెడీ చేసి తెప్పించారు. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ సలహా అడిగితే ముఖ్యమంత్రి ఒక ఇంటి విషయంలోనే అనుమతి ఉంటుంది. రెండో ఇంటి విషయంలో ఉండదు అని చెప్పారు. నేను ఇదే విషయం చెబితే... రామారావుకు నా మీద లేనిపని పితూర్లు చెప్పి వ్యతిరేకత పెంచారు.

ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, అందుకే ఈ ఫలితం
‘ఎన్టీఆర్ బయోపిక్'కు దర్శకత్వం వహించిన క్రిష్కు 1982లో జరిగిన విషయాలేమీ తెలియవు. కేవలం చంద్రబాబును ప్రమోట్ చేయడానికే ప్రయత్నించారు. ప్రజలకు అంతా తెలుసు కాబట్టే అది వర్కౌట్ కాలేదు' అని నాదేండ్ల భాస్కర్ రావు వ్యఖ్యానించారు.


Click it and Unblock the Notifications











