పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నాజర్ వివరణ.. సోదరుడికి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కోలీవుడ్ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలని 'ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా' (The Film Employees Federation of South India-FEFSI) తీసుకున్న నిర్ణయం సరి కాదని పవన్ కల్యాణ్ మాట్లాడారు. దీనిపై తాజాగా నటుడు, నడిగర్ సంఘం (Nadigar Sangam) అధ్యక్షుడు నాజర్ రియాక్ట్ అయ్యారు. నాజర్ ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..

వీడియో ద్వారా: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం (తమిళ నటీనటులు సంఘం) అధ్యక్షుడు నాజర్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని ఓ వీడియో విడుదల చేసి అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశారు.

తప్పుడు ప్రచారం: "సోషల్ మీడియాలో ఓ విషయంపై తప్పుగా ప్రచారం జరుగుతోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం అవుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే తిరస్కరించి వ్యతిరేకిస్తాను. సినీ పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవు. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు" అని నాజర్ తెలిపారు.

అలా చెప్పలేదు: "నా సోదరుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచనలు చేశారు. తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నిషియన్లను పెట్టుకోండని అన్నారు. అంతేకానీ, ఇతర భాషలకు చెందిన వ్యక్తులు వద్దని ఎవరూ చెప్పలేదు" అని నాజర్ వివరణ ఇచ్చారు.
కలిసి తీద్దాం: "ప్రస్తుతం పాన్ ఇండియా హవా, ఓటీటీల వినియోగం ఎక్కువైంది. ఇలాంటి సమయంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతోమంది ఆర్టిస్టులను, టెక్నిషియన్లను తమిళ సినీ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, RRRల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దం" అని నాజర్ చెప్పుకొచ్చారు.

పవన్ స్పీచ్: కాగా జూలై 25న శిల్పాకళా వేదికలో జరిగిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ అనేక విషయాలు మాట్లాడారు. రాజకీయాలు, పర్సనల్ లైఫ్, సినిమాలు వంటి అంశాలు టచ్ చేస్తూ తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫెఫ్సీ (FEFSI) ఇటీవల నిర్దేశించుకున్న కొత్త మార్గాదర్శకాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు పవన్ కల్యాణ్.
అదే సినిమా: "తమిళ చిత్ర పరిశ్రమకు నాదొక విన్నపం. తమిళ సినీ పరిశ్రమ తమిళులకే అవకాశాలు ఇవ్వాలనే నిర్ణయం నుంచి బయటకు రావాలి కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని పరిశ్రమల నటీనటులను తీసుకుంటుంది. కోలీవుడ్ ఇండస్ట్రీ తమిళులకే అంటే సినీ పరిశ్రమ ఎదగదు. కేరళ నుంచి సుజిత్, నార్త్ నుంచి ఊర్వశీ రౌటేలా ఇలా అందరిని కలుపుకుంటూనే సినిమా" అని పవన్ కల్యాణ్ అన్నారు.

తమిళం నుంచే: "తక్కువ పరిధిలో ఆలోచిస్తే కుచించుకుపోతాం. తమిళ సినీ పరిశ్రమ తమిళులకే అనే మాట నా వద్దకు వచ్చింది. ఈరోజు సముద్ర ఖని ముందు ఓ మాట చెబుతున్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు రావాలి. మీరు కూడా RRR వంటి సినిమాలు చేయాలి. వరల్డ్ పాపులర్ సినిమాలు కోలీవుడ్ నుంచి రావాలి" అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











