ఆ టాలెంట్ ఉంది, అంతసీన్ లేదు: బండ్ల గణేష్ గొంతుకోసుకోవడంపై నాగబాబు!
తెలంగాణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్.... ఎన్నికల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పలు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న గణేష్ తనదైన వ్యాఖ్యానంతో అందరినీ నవ్వించాడు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చితీరుతుందని, ఒక వేళ రాకపోతే గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ సంచలన వ్యఖ్యలు చేశారు. అయితే అతడి అంచనాలు తలక్రిందులు కావడం, పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత గణేష్ రెండు మూడు రోజులు మీడియాకు కనిపించకుండా పోయారు. తర్వాత తిరుపతిలో మీడియాకు చిక్కగా... ఎలక్షన్స్ సమయంంలో వంద అంటామండి, అన్నీ చేస్తామా? అంటూ మాటమార్చారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై తాజాగా నాగబాబు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.

ఆ టాలెంట్ సినిమాల్లో పెడితే బావుండేది
బండ్ల గణేష్ వేరే విషయాల్లో ఎలా ఉన్నా అతడి ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది. చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. ఆ టాలెంట్ సినిమాల్లో పెట్టి ఉంటే చాలా పెద్ద కామెడియన్ అయ్యేవాడు. దాన్ని సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్లో చూపిస్తున్నాడు... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

అంత సీన్ లేదని తెలుసు
బండ్ల గణేష్ ఎంపీ, ఎమ్మెల్యే కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా కాలం పాటు బొత్స సత్యనారాయణ అనుచరుడిగా ఉన్నాడు. పీక కోసుకుంటాను, బ్లేడు తెండి అన్నపుడే... ఓడి పోతే ఏం చేస్తాడు? నిజంగానే కోసుకుంటాడా? అని అంతా సందేహ పడ్డారు. కానీ అంత సీన్ లేదని నాకు అప్పుడే తెలుసు. తర్వాత మాట మార్చి ఎలక్షన్ సమయంలో వంద అంటామండీ అని అంటాడని కూడా తెలుసు... నేను ఊహించినట్లే ఆ మాట అన్నాడని నాగబాబు తెలిపారు.

అందుకు మెచ్చుకోవాలి
ఏది ఏమైనా ఓ వైపు రేవంత్ రెడ్డి ప్రసంగాలు, మరో వైపు టీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రసంగాలు విన్న మాలాంటి వారికి బండ్ల గణేష్ ఇంటర్వ్యూలు కామెడీ పంచాయి. అందరినీ నవ్వించినందుకు మెచ్చుకోవాలి.

చాలా ఎక్కువ మాట్లాడారు
బండ్ల గణేష్లో ఎక్కడో తొందరపాటు కనిపించింది. ఎలక్షన్ జరిగే మూడు నెలల ముందు వచ్చి... నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను, గెలిచేస్తాను, మా పార్టీ వచ్చేస్తుందని ఎక్కువ మాట్లాడారు. ఓవర్ నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ కుదరలేదు. వాస్తవానికి అలాంటివి సాధ్యం కావని నాగబాబు అన్నారు.

ఓవర్ నైట్ వండర్స్ ఎప్పుడూ జరుగవు
కళ్యాణ్ బాబు ఓవర్ నైట్ రిజల్ట్ కోసం చూడలేదు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు దాటిపోయింది. 2014లో జనసేన పార్టీ పెట్టారు. ఓవర్ నైట్ వండర్స్ ఎప్పుడూ జరుగవు. గణేష్ అనే వ్యక్తి కన్సిస్టెంటుగా పార్టీలో ఉంటూ, పార్టీ తరుపున పని చేస్తూ దానికి సరిపోయే విధంగా రీసోర్స్ తయారు చేసుకుంటూ, మంచి మనుషులను సంపాదించుకుంటే ఈ సంవత్సరం కాక పోయినా వచ్చే ఐదేళ్లు లేదా పదేళ్లకైనా ఆ అవకాశం ఉంటుంది.

టీఆర్ఎస్ గెలుపుకు కారణం
టీఆర్ఎస్ గత పాలనలో మంచి పనులు చేసింది కాబట్టే మళ్లీ అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ లో సెటిలైన సెటిలర్లను కూడా తెలంగాణ బిడ్డలుగా చూసుకుంటామని చెప్పి కేసీఆర్ భరోసా ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నారు. మహా కూటమి ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో చంద్రబాబు టీడీపీ ఎంటరవ్వడం వల్ల పది సీట్లు పడిపోయాయి. కూటమిలో ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి కూడా లేడు. అన్నింటికీ మించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కూటమి ఓటమికి ప్రధాన కారణమని నాగబాబు అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











