బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్: వాళ్ల పొరపాటు వల్లే సమస్యలు.. విష్ణు అలా చెప్పకూడదంటూ కామెంట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికల వేడి కనిపిస్తోంది. వీటికి చాలా సమయం ఉన్నప్పటికీ.. కొద్ది రోజుల ముందు నుంచే పలువురు ప్రముఖులు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. అంతేకాదు, వాళ్ల వాళ్ల భవిష్యత్ ప్రణాళికలను కూడా వెళ్లడించారు. దీంతో వాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఏకగ్రీవం చేయాలని అన్నారు. అంతకు ముందే ఈ విషయాన్ని మంచు విష్ణు ప్రస్తావించాడు. తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆ వివరాలు మీకోసం!

ఈ సారి పోటీలో ఐదుగురు ప్రముఖులు
చాలా కాలంగా 'మా' ఎన్నికలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలిచారు. వారెవరో కాదు చాలా కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీ పడబోతున్నారు.

విష్ణు సుదీర్ఘ వీడియో.... తప్పుకునేలా
మా అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన అతడు.. మా బిల్డింగ్ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అన్నాడు. అలా జరిగితే తప్పుకుంటానని చెప్పాడు.

విష్ణుకు మద్దతు ప్రకటించిన బాలకృష్ణ
చాలా రోజులుగా నందమూరి బాలకృష్ణ ఎవరికి మద్దతు ఇస్తారు అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం ఆయన స్పందించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించకూడదు అంటూనే కొందరు ధనాన్ని వృథా చేశారంటూ విమర్శించారు. అదే సమయంలో బిల్డింగ్ కోసం మంచు విష్ణుకు మద్దతు ఇస్తానని ప్రకటించారు.

బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్
ఏకగ్రీవం కావాలంటూ మంచు విష్ణు.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తాజాగా స్పందించారు. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడిన ఆయన.. 'ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకోవడం అంత మంచి నిర్ణయం కాదు. ఎవరిని ఎన్నుకోవాలన్నది మా సభ్యులు నిర్ణయిస్తారు. కాబట్టి కచ్చితంగా ఎన్నికలు జరగాలి. అందులో ది బెస్ట్ పర్సన్ ఎవరో వాళ్లే గెలవాలి' అని చెప్పుకొచ్చారు.

వాళ్ల పొరపాటు వల్లే సమస్యలొచ్చాయి
మా బిల్డింగ్ వ్యవహారం గురించి ప్రస్తావించిన నాగబాబు 'గతంలో మురళీ మోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ నుంచి మా బిల్డింగ్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎవరూ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకే చాంబర్లోని చిన్న ఆఫీస్ రూమ్లో మా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి గతంలో పని చేసిన ప్రెసిడెంట్లు అందరూ బాధ్యులే' అని వివరించారు.

విష్ణు అలా చెప్పకూడదంటూ కామెంట్
మా ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. 'మంచు విష్ణు ఎన్నికల నుంచి తప్పుకుంటానడం సరైన నిర్ణయం కాదు. ఆయన పోటీలో ఉండాలి. జనాలను బెదిరించినప్పుడే ఏకగ్రీవాలు అవుతుంటాయి. మంచు విష్ణు ఎందుకు తప్పుకోవాలి? అతడిని నేను స్వాగతిస్తున్నా' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన విజయానికి కృషి చేస్తానంటూ
ఇక, ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్కు నాగబాబు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మాట్లాడుతూ 'చాలా రోజుల క్రితమే ఆయన నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. బిజీ ఆర్టిస్టుగా మీరు 'మా'కు సమయం కేటాయించగలరా అని అడిగాను. దానికి ఆయన తప్పకుండా ఇస్తాను అని చెప్పారు. అందుకే ఆయన విజయానికి నా వంతు కృషి చేస్తా' అని పేర్కొన్నారు మెగా బ్రదర్.


Click it and Unblock the Notifications











