కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు.. గాంధీజీ కూడా అదే చెప్పేవారు.. మళ్లీ గెలికిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై వ్యాఖ్యలు చేసిన రోజు నుంచి నిత్యం ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటోంది. నాగబాబుపై రాజకీయంగా కొంతమంది టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నాగబాబు సైతం గట్టిగానే తిప్పి కొడుతున్నాడు. సత్యం కఠినంగా ఉంటుంది.. సత్యం వధ ధర్మం చర అంటూ సెటైర్స్ వేస్తున్నాడు. అయితే నాగబాబు ఇలా ఏదో ట్వీట్ చేయడం మళ్లీ అది రచ్చ రచ్చగా మారడంతో.. మళ్లీ ఎవరో ఒకరు కామెంట్ చేయడంతో మెగాబ్రదర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్ మరింత వైరల్ అవుతోంది.

కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..
నాథూరాం గాడ్సే జయంతి రోజున మొదలైన ఈ ట్వీట్ల దండయాత్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. నాగబాబు తన ట్వీట్లో గాడ్సేను నిజమైన దేశ భక్తుడని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశమని, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని కాస్త ఘాటుగా ట్వీట్ చేశాడు.

నాగబాబు ట్వీట్పై భిన్నాభిప్రాయాలు..
గాడ్సేపై నాగబాబు చేసిన కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నాగబాబును ఎంత మంది వ్యతిరేకించారో అంతకు రెట్టింపు మంది సమర్థించారు. అదే సమయంలో నాగబాబుపై విజయశాంతి సెటైర్స్ వేయగా.. ఆర్జీవీ మద్దతు పలికాడు. నాగబాబు చెప్పింది నిజమనీ, ఆ సమయంలో ఆయన అభిప్రాయాన్ని ఎవ్వరూ ప్రచురించలేదని, గాడ్సేపై సినిమా కూడా తీస్తానని వర్మ ఓ ప్రకటన చేశాడు.

వరుస వివరణలు..
తన ట్వీట్లపై వస్తోన్న వ్యతిరేకతను గుర్తించిన నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదని చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది తన వ్యక్తిగత బాధ్యతేనని స్పష్టం చేశాడు. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ ఎటువంటి ప్రమేయమూ లేదని చెప్పుకొచ్చాడు.

కరెన్సీ నోట్లపై కామెంట్స్..
తాజాగా నాగబాబు మరో సారి అందర్నీ గెలికాడు. ఈసారి భారత కరెన్సీ నోట్లపై పడ్డాడు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ఏముందంటే.. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ

ఆయన కూడా అదే చెప్పేవారు..
గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంద'ని చెప్పుకొచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలు ఇంకెంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











