'మా' ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత, రాజశేఖర్పై నాగబాబు కామెంట్స్!
Recommended Video

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శివాజీ రాజా రెండవసారి పోటీలో నిలిచాడు. శివాజీరాజాకు పోటీగా నరేష్ బరిలోకి దిగుతున్నారు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. శివాజీ రాజాకు శ్రీకాంత్, కమెడియన్ పృథ్వి, నటుడు నాగినీడు లాంటి వాళ్లంతా మద్దతునిస్తున్నారు. ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

నాగబాబు మద్దతు
ఆదివారం రోజు మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ఊహించని విధంగా నరేష్ ప్యానల్ కు మద్దతునిచ్చారు. తాను ఎందుకు నరేష్ ప్యానల్ కు సపోర్ట్ ఇస్తున్నానో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా ఒకసారి కంటే ఎక్కువగా ఎవరూ కొనసాగకూడదని అన్నారు. ప్రతిసారి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే మా అసోసియేషన్ లో ఎక్కువగా మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని నాగబాబు మీడియా సమావేశంలో వివరించారు.

సీనియర్ నటుడిగా
మా అధ్యక్ష పదవికి నరేష్ అన్నివిధాలా అర్హుడు అని నాగబాబు అభిప్రాయ పడ్డారు. హీరోగా, నటుడిగా చాలా కాలం నుంచి నరేష్ కొనసాగుతున్నట్లు నాగబాబు అభిప్రాయపడ్డారు. కొత్త వాళ్ళు వస్తే నూతన కార్యక్రమాలు చేపడతారని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా నాగబాబు నరేష్ ప్యానల్ కు ఓ విన్నపం చేశారు. మా అసోసియేషన్ లో ఎంట్రీ ఫీజులు ఇక పెంచవద్దని అన్నారు. కుదిరితే ఎంతోకొంత తగ్గించాలని, ఫీజులు కట్టలేని ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారని నాగబాబు అభిప్రాయపడ్డారు. అందుకు నరేష్, రాజశేఖర్, జీవిత అంగీకారం తెలిపారు.

శివాజీ రాజా
శివాజీ రాజా అధ్యక్షుడిగా చేసినప్పుడు నేను ఓ విషయంలో బాగా నిరాశకు గురయ్యానని నాగబాబు అన్నారు. మా అసోసియేషన్ ప్రతిష్ట ఏ సందర్భంలో కూడా దిగజారకూడదు. కానీ ఇటీవల మా అసోసియేషన్ పై ఎవరు పడితే వాళ్ళు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు అంటూ శ్రీరెడ్డి సంఘటన గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆ సందర్భంలో శివాజీ రాజా బలంగా మాట్లాడలేకపోయారని నాగబాబు విమర్శించారు. కానీ జీవితగారు మాత్రం చాలా బలంగా ఆ సంఘటన విషయంలో మాట్లాడినట్లు నాగబాబు తెలిపారు. తప్పుగా ప్రచారం చేస్తున్న మీడియాకు కూడా ఆమె సరైన సమాధానం ఇచ్చారని ప్రశంసించారు.

ఇద్దరూ బలంగానే
ఆదివారం జరగబోయే ఎన్నికలో విజయం సాధించేందుకు అటు శివాజీ రాజా ప్యానల్, ఇటు నరేష్ ప్యానల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ బలంగానే కనిపిస్తున్నారు. శివాజీ రాజా ప్యానల్ లో హీరో శ్రీకాంత్, నాగినీడు, కమెడియన్ పృథ్వి లాంటి వాళ్లంతా ఉన్నారు. ఇక నరేష్ ప్యానల్ లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ, అలీ ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











