బయోపిక్ ప్లాప్ అయితే.. భరించడం నా వల్ల కాదు.. నాగార్జున!
Recommended Video

టాలీవుడ్ లో.. ఆ మాటకొస్తే దేశం మొత్తం అన్ని చిత్ర పరిశ్రమల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖల జీవితాలని వెండి తెరపై ఆవిష్కరించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఇప్పటికే లెజెండ్రీ నటి సావిత్రి బయోపిక్ మహానటిగా వచ్చి విజయం సాధించింది. ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో టాలీవుడ్ లో ఏఎన్నార్ బయోపిక్ కి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. దీనిపై నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మిస్టర్ మజ్ను ప్రమోషన్స్
అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున కూడా తనయుడు సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మీడియా ముఖాముఖిలో నాగార్జునకు ఏఎన్నార్ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. నాగార్జున ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.

నేను భరించలేను
నాన్నగారు నటించిన సినిమాలు రీమేక్ చేయడానికే మేమెంతా బయపడుతున్నాం. అలాంటిది ఆయన బయోపిక్ చేసే సాహసం చేయను. నాన్నగారికి సంబంధించినది ఏదైనా మాకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఒకవేళ ఏఎన్నార్ బయోపిక్ చేసి అది పరాజయం చెందితే భరించడం నావల్ల కాదు. మా ఫ్యామిలి కూడా తట్టుకోలేదు. ఏఎన్నార్ బయోపిక్ చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని నాగార్జున తేల్చి చెప్పేశాడు.

ఊహాగానాలు
నాగార్జున తన కుటుంబ సభ్యులతో ఏఎన్నార్ బయోపిక్ గురించి చర్చించారని, అంతా ఒకే చెప్పడంతో సినిమా తీసేందుకు నాగ్ రెడీ అవుతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. నాగార్జున తాజా సమాచారంతో ఆ ఊహాగానాలకు తెరదించారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ విడుదలవుతుండడంతో ఏఎన్నార్ బయోపిక్ గురించి కూడా చర్చ మొదలైంది.

నిరాశపరిచిన ఎన్టీఆర్ కథానాయకుడు
అభిమానులంతా ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాగా వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని మలచలేకపోయింది. ఏఎన్నార్ బయోపిక్ పై నాగార్జున వెనక్కు తగ్గడానికి ఇది కూడా ఓ కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











