ఆ తప్పు మాదే...నిజాయితీగా మాట్లాడిన నాగార్జున
ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చలేదంటే ఆ తప్పు మాదే. చాలామంది సినిమా బాగా తీశాం...కానీ ప్రేక్షకులు ఆదరించలేదని అంటుంటారు. ఆ వాదనను నేను అంగీకరించను. ఎక్కడో ఒక చోట కొన్ని తప్పులు చోటు చేసుకొనుంటాయి. అందుకే ఆ రకమైన ఫలితాలు. మంచి సినిమాకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది అంటూ ఫెయిల్యూర్స్ పై నిజాయితీగా విశ్లేషించారు నాగార్జున. ఆయన తాజా చిత్రం గగనం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో భాగంగా నాగార్జున ఇలా స్పందించారు. అలాగే ఎలాంటిదైనా ఒక సినిమా విజయం సాధిస్తే చిత్ర పరిశ్రమకు ఎంతో కొంత మేలు జరుగుతుంది అన్నారు. ఇక గగనం చెయ్యటానికి కారణం చెప్తూ..ఇతర భాషల్లో వచ్చే వైవిధ్యమైన చిత్రాల్ని మనం బాగానే చూస్తున్నాం. సినిమా బాగా తీశారని వాళ్లను పదే పదే అభినందిస్తున్నాం. అంటే మనకు ఆ తరహా చిత్రాలు నచ్చినట్టే లెక్క. మరి అలాంటివి ఇక్కడ మనమెందుకు చేయకూడదు. అందుకే నేనూ అలాంటి ప్రయత్నమే చేశా అన్నారు. 'గగనం' ఈ నెల 11న విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











