గోవిందా గోవిందా చిత్రంలో నటించిన నాగార్జున ఆదివారం పెరైడ్ గ్రౌండ్ లో జరిగిన లక్ష స్వరార్చన లో గోవిందా ..గోవిందా అంటూ నామస్మరరణ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నమయ్య సినిమా సమయంలో దర్శక, నిర్మాతలు తనతో పలుసార్లు గోవింద నామం పలికించాలని ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. అయితే భక్తిభావంలో మునిగిన ఇంతమందిని చూసిన తర్వాత తొలిసారి తాను దైవ నామాన్ని బహిరంగంగా జపిస్తున్నట్లు చెప్పారు. ఏడుకొండలవాడా... గోవిందా.. గోవిందా... అంటూ ఆయన హాజరైన వారిని ఉత్సాహపరిచారు.అన్నమయ్యగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన నాగార్జున ఈ వేదికపై తొలిసారి బహిరంగంగా వెంకటేశుని నామస్మరణ చేయటం అందరినీ ఆకట్టుకుంది.సంగీత దర్శకుడు రాధాకృష్ణ స్వరపరచిన యానిమేషన్ చిత్రం 'శ్రీబాలాజీ" ఆడియోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ, దొరస్వామిరాజు, నిహాల్, ఆర్పీ పట్నాయక్, దైవజ్ఞశర్మ, సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఇందులో పాల్గొన్నారు.