AP Elections జగనన్న కాదు జలగన్న.. నా కంటే మహా నటుడు.. బాలయ్య మాస్తో కుమ్మేశాడుగా!
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార వైసీపీకి, విపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చావోరేవో వంటివి. మరోసారి అధికారాన్ని అందుకోవాలని జగన్, ఈసారి పవర్ చేజిక్కకుంటే ఉనికికే ప్రమాదమని టీడీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జగన్ ఒంటరిగా బరిలో దిగితే.. చంద్రబాబు మాత్రం జనసేన, బీజేపీలతో కలిసి వైసీపీని ఎదుర్కొంటున్నారు. ఇరుపార్టీల నేతలు ప్రచారాన్ని మోత మోగిస్తూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.
తన కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే కసితో వున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురంలో పనులు చూసుకుంటనే రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు. సోమవారం సూళ్లూరుపేటలో జరిగిన బహిరంగసభలో సీఎం జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు బాలయ్య. జగన్ తన కంటే పెద్ద నటుడు అంటూ నటసింహం సెటైర్లు వేశారు. ఒక్క ఛాన్స్, కోడికత్తి, మొన్నామధ్య గులకరాయి అంటూ ఇటీవల పరిణామాలను ఎత్తిచూపారు.

తాను నటిస్తే.. జగన్ జీవిస్తారని, రీల్ లైఫ్లోనైనా రియల్ లైఫ్లోనైనా బాలకృష్ణ ఒకలాగే వుంటాడని చెప్పుకొచ్చారు. ఆస్కార్లు, పద్మశ్రీలు జగన్ ముందు దిగతుడుపేనని.. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రాన్ని రావణ కష్టంలా మార్చారని ఎద్దేవా చేశారు. జగనన్నను అంటూ జలగలా పీడిస్తున్నారని.. మావయ్యనంటూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని బాలయ్య పంచ్లు విసిరారు. నవరత్నాలంటూ నవనాడులను కృంగదీశాడంటూ బాలయ్య ధ్వజమెత్తారు.
ఇకపోతే.. హిందూపురంలో బాలయ్య విజయం కోసం ఆయన సతీమణి వసుంధర ప్రచారం నిర్వహిస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు టీడీపీ హిందూపురం ఓడిపోయింది లేదు. అన్నగారు మూడు సార్లు, హరికృష్ణ ఒకసారి, బాలకృష్ణ రెండు సార్లు విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్పై గురి పెట్టారు. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హిందూపురంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, బాలయ్యపై ఈసారి బీసీ మహిళను బరిలో దించారు. కురవ సామాజికవర్గానికి చెందిన దీపికను జగన్ అభ్యర్ధిగా ప్రకటించారు. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య, ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో నియోజకవర్గంలోని వైసీపీ కేడర్ మొత్తం దీపిక వెంట నడుస్తున్నారు. ఆమె కూడా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తూ బాలయ్యపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే బాలయ్య మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఓటు బ్యాంక్, నందమూరి కుటుంబంపై అభిమానం, ప్రస్తుతం జనసేన -బీజేపీ-టీడీపీ కూటమి తనను గెలిపిస్తాయని బాలకృష్ణ చెబుతున్నారు. గడిచిన పదేళ్లుగా అధికారంలో వున్నా, లేకున్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు తనకు ప్లస్ అవుతాయని నటసింహం అంటున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కారం, ఆసుపత్రి నిర్మాణం వంటివి బాలకృష్ణకు వ్యక్తిగతంగా మంచిపేరు తీసుకొచ్చాయి.
ఇదిలా ఉండగా, తాను సినిమా షూటింగ్లు, రాజకీయ కారణాలతో నియోజకవర్గానికి దూరంగా వున్నప్పటికీ పీఏలు , స్థానిక నేతల ద్వారా ప్రజలకు అందుబాటులో వుంటున్నారు బాలయ్య. అయినప్పటికీ వైసీపీ కూడా బలం పుంజుకోవడంతో గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా హిందూపురంలో టీడీపీకి గట్టిపోటీ ఎదురవుతోంది.


Click it and Unblock the Notifications











