న్యాయ నిర్ణేత దేవుడే.. అందుకే వెనుకడుగు వేయలేదు.. టికెట్ రేట్ల పెంపు వివాదంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
బాక్సాఫీస్ బొనాంజా, నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇటీవల 100 కోట్ల క్లబ్లో చేరడం నందమూరి అభిమానుల్లోను, సినీ వర్గాల్లోను జోష్ పెంచింది. అఖండమైన విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటున్నారు. బుధవారం ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో పూజలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..

ఆనాడు ఎన్టీఆర్.. నేడు అఖండ
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది. సినిమా అందించిన విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాను ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు భక్తిని కాపాడారు. ఇప్పుడు అఖండ సినిమా సనాతన ధర్మాన్ని కాపాడింది. సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని బాలకృష్ణ అన్నారు.

కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో
ఎవరైనా ఏదైనా పని తలపెడితే అమ్మవారి అశీస్సులు ఉంటాయి. వారికి విజయం సిద్దించేలా కనకదర్గ అమ్మవారు కరుణిస్తారు. అఖండ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు అని బాలకృష్ణ చెప్పారు.

ప్రభుత్వం అడ్డుకొన్నా.. డేర్ స్టెప్ వేశాం
టికెట్ల రేట్ల పెంపును అడ్డుకొనేందుకు ఏపీ ప్రభుత్వం జీవో 35 తీసుకొచ్చింది. అయితే అఖండ రిలీజ్కు ముందు కొందరు ఆపమని రిక్వెస్ట్ చేశారు. కానీ సినిమా కంటెంట్ పరంగా మంచిగా ఉందనే విషయంతో డేర్ స్టెప్ వేశాం. అందుకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో వెనుకడుగు వేయలేదు. మా నిర్ణయం సరైనదేనని ప్రేక్షకులు నిరూపించారు. అఖండ చిత్ర విజయం పరిశ్రమ వర్గాల్లో ధైర్యం నింపింది. నిర్మాత, దర్శకులు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అని బాలకృష్థ తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో..
టిక్కెట్ రేట్లు పెంపు విధానంపై గతంలో చర్చించుకున్నాం. ఏదైతే అది కానివ్వమని అఖండ సినిమాను విడుదల చేశాం. మంగళవారం జీవో 35ని హైకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ సర్కార్ అప్పీల్కు వెళ్తామని అంటున్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా నేను గతంలో మాట్లాడాను. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి నేను స్పందిస్తా. ఈ వివాదంలో న్యాయ నిర్ణేత దేవుడే అని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమానే గెలిచింది అంటూ బోయపాటి
అఖండ సినిమా విజయం పరిశ్రమకు మంచి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నిచ్చింది. చిత్రం విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చింది, సినిమాను గెలిపించిన ప్రతిఒక్కరిని ధన్యవాదాలు. అఖండ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి. మంచి కథ ఉంటే మల్టీస్టారర్ సినిమా తీయడానికి నేను సిద్ధమే అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.

అఖండకు 100 కోట్ల వసూళ్లు
ఇదిలా ఉండగా, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకొన్నది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు భారీ సక్సెస్ను అందుకొన్నాయి. తాజాగా రిలీజైన అఖండ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదుచేసింది. ఓవర్సీస్లో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











