బాలయ్య స్పీచ్ వైరల్.. దేశ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం, దురాక్రమణలకు ఎదురెళ్ళాడు!
2017-18 సంవత్సరానికిగాను టీఎస్ఆర్ అవార్డుల వేడుక ఆదివారం రోజు వైజాగ్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ లో కళాబంధుగా పేరుగాంచిన ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త టి సుబ్బిరామిరెడ్డి ప్రతి సంవత్సరం ఈ అవార్స్డ్ వేడుకని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు, బాలీవుడ్ నటులు, తమిళ, కన్నడ నటులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ సినియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు ఒకేసారి వేదికపై కనిపించి అభిమానులని అలరించారు. టీఎస్ఆర్ అవార్డ్స్ వేడుకలో బాలయ్య చేసిన చక్కటి ప్రసంగం అభిమానులని ఆకట్టుకుంది. బాలయ్య స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీర జవానుల గురించి
నందమూరి బాలకృష్ణ టీఎస్ఆర్ అవార్డ్స్ 2017-18 సంవత్సరానికి గాను గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి బాలయ్య ఉత్తమ కథానాయికుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య వేదికపై మాట్లాడుతూ.. ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత వీర జవానులు త్యాగాలని గుర్తు చేసుకున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులు ఉగ్రవాదుల దుశ్చర్య వలన ప్రాణాలు కోల్పోయారని బాలయ్య తెలిపారు. ఉగ్రవాదుల చర్యని తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలయ్య తెలిపారు.

ఇది కూడా ఓ పండుగ
మనకు ప్రతి ఏటా వచ్చే పండుగల్లో టీఎస్ఆర్ జాతీయ అవార్డుల వేడుక కూడా ఓ పండుగే అని బాలయ్య అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏళ్లతరబడి నిర్వహిస్తున్న ఘనత టి సుబ్బిరామిరెడ్డికే దక్కుతుందని అన్నారు. సుబ్బిరామిరెడ్డి అజాత శత్రువు లాంటివారు అని బాలయ్య తెలిపారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే తామంతా వెళతామని అన్నారు. ఎంతో కస్టపడి సినిమా చేసి విజయాన్ని అందుకున్న తర్వాత ఇలాంటి అవార్డులు అందుకోవడం ప్రోత్సాహకరంగా ఉంటుందని బాలయ్య అన్నారు.

ఉత్తమ కథానాయకుడిగా
గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి గాను నన్ను ఉత్తమ కథానాయకుడిగా ఎంపిక చేసిన ప్రేక్షకులకు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. నాన్నగారు చేయని చిత్రాల్లో గౌతమి పుత్ర శాతకర్ణి ఒకటి అని బాలయ్య తెలిపారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దురాక్రమణలకు ఎదురెళ్లి
ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూస్తున్నాం అంటూ పుల్వామా ఉగ్రదాడిని బాలయ్య ప్రస్తావించాడు. అప్పట్లో కూడా విదేశీయులు భారతదేశంలో దురాక్రమణలకు ప్రయత్నించారు. విదేశీయులకు ఎదురెళ్లి దేశం మొత్తాన్ని ఏకం చేసిన ఘనత గౌతమి పుత్ర శాతకర్ణికి దక్కుతుందని బాలయ్య తెలిపారు. అలాంటి మహా వీరుడి పాత్రలో నటించడం తనకు దక్కిన అదృష్టం అని బాలయ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











