జన్మదిన వేడుకలు వద్ధు , స్వయంగా తన చేతులతో.. మరణానికి ముందు హరికృష్ణ చివరి లేఖ
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు , టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఆగస్ట్ 29, 2018 తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు, పోలీసులు హుటాహుటిన నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1956 సెప్టెంబర్ 2న కృష్ణాజిల్లా నిమ్మకూరులో జన్మించారు హరికృష్ణ. 1974లో తాతమ్మ కల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దానవీర శూరకర్ణ, శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం తదితర చిత్రాల్లో నటించారు. 1973లో లక్ష్మీ కుమారిని పెళ్లాడిన హరికృష్ణకు కుమారులు జానకీరామ్, కళ్యాణ్ రామ్, కుమార్తె సుహాసినీ ఉన్నారు. జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా.. హరికృష్ణ మరో భార్య శాలిని.. ఈ దంపతుల కుమారుడే జూ.ఎన్టీఆర్.

సినిమాల కంటే రాజకీయాలను ఇష్టపడే హరికృష్ణ.. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తన తండ్రి ఎన్టీఆర్కు చేదోడు వాదోడుగా నిలిచారు. ఎన్టీఆర్ చైతన్య రథంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తే.. ఆ వాహనాన్ని స్వయంగా నడిపారు హరికృష్ణ. ఈ క్రమంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా నిరసిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి హరికృష్ణ సంచలనం సృష్టించారు. కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ల సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ గర్వంగా ఫీలవుతున్నారు. అంతా హ్యాపీగా ఉన్న దశలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ విషాదంలోకి నెట్టింది.
గురువారం హరికృష్ణ వర్ధంతి నేపథ్యంలో ఆయన అభిమానులకు రాసిన చివరి లేఖ వైరల్ అవుతోంది. ఇప్పటి మాదిరే అప్పుడు కూడా కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి పరిస్ధితి చూసి చలించిపోయిన హరికృష్ణ మరణానికి కొద్దిగంటల ముందు త్వరలో తన పుట్టినరోజులు నిర్వహించొద్దని అభిమానులకు ఓ లేఖ రాశారు.
మన రాష్ట్రంతో పాటు కేరళలో వరదలు, వర్షాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారని హరికృష్ణ తెలిపారు. ఇలాంటి బాధాకరమైన పరిస్ధితుల్లో సెప్టెంబర్ 2న తన అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని ఆయన కోరారు. తన జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయొద్దని.. పుష్పగుచ్చాలు, దండలు తీసుకురావొద్దని, వాటికి అయ్యే ఖర్చును వర్షాల వల్ల నష్టపోయిన వారికి అందజేయాలని కోరుతున్నానని హరికృష్ణ అందులో పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఐదేళ్ల నాటి ఈ లేఖ మరోసారి వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











