Nandamuri Tarakaratna కన్నుమూత.. 23 రోజులుగా మృత్యువుతో పోరాటం చేస్తూ తారకరత్న మృతి
నందమూరి వంశ నట వారసుడు యువ హీరో తారకరత్న ఇకలేరు. జనవరి 27వ తేదీన గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తను నందమూరి కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. తారకరత్న మరణవార్తతో నందమూరి అభిమానులు, సినీ ప్రేక్షకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, సహచర నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. తారకరత్న వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

తారకరత్న జననం
నందమూరి మోహన కృష్ణ దంపతులుకు నందమూరి తారకరత్న జనవరి 8వ తేదీ, 1983లో జన్మించారు. ఆయనకు భార్ అలేఖ్య, నందమూరి నిషిక సంతానం ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, స్వర్గీయ హరికృష్ణ ఆయనకు బాబాయ్ పెదనాన్నలు. హీరోలు నందమూరి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సోదరులు అనే విషయం తెలిసిందే.

2001లో సినీ రంగ ప్రవేశం
నందమూరి నట వారసుడిగా తారకరత్న 2001 సంవత్సరంలో అట్టహాసంగా తన సినిమా కెరీర్ను ఆరంభించారు. ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తన చలన చిత్ర జీవితాన్ని ఆరంభించారు. తొలి సినిమాతోనే ప్రశంసలు అదుకోవడంతోపాటు భారీ విజయాన్ని అందుకొన్నారు.

రెండు దశాబ్దాల కాలంలో
తారకరత్న తన రెండు దశాబ్దాల కెరీర్లో యువరత్న, తారక్, నం, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, నందీశ్వరుడు, విజేత, మనమంతా, భక్త సిరియాల, రాజా చేయి వస్తే.. దేవీనేని, సారథి, S5 No Exit అనే చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల 9 అవర్స్ వెబ్ సిరీస్లో కూడా నటించడం తెలిసిందే. 2009లో అమరావతి సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు గాను.. బెస్ట్ విలన్ నంది అవార్డును అందుకొన్నారు.

రాజకీయాల్లో ఆసక్తి పెంచుకొని..
ఇటీవల కాలంలో తారకరత్న రాజకీయాల్లోకి ఆసక్తి చూపుతూ కనిపించారు. తాత స్వర్గీయ ఎన్టీరామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకొన్నారు. అందులో భాగంగానే కుప్పంలో నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా.. ఆ కార్యక్రమానికి హాజరై గుండెపోటుకు గురయ్యారు. అయితే గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయిందని వైద్యులు ప్రకటించడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

మృత్యువుతో పోరాటం చేస్తూ..
గత జనవరి 27వ తేదీన గుండెపోటుకు గురైన తారకరత్న మృత్యువుతో పోరాటం చేశారు. ఆయనను బతికించేందుకు విదేశాల నుంచి వైద్యులు బెంగళూరుకు చేరుకొన్నారు. తారకరత్నను కోమాలో నుంచి బయటకు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు మహాశివరాత్రి రోజున ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయేలా చేసింది.


Click it and Unblock the Notifications











