'బాహుబలి' ఆడియోకు 'ఈగ' యాంకరింగ్ !
హైదరాబాద్ : రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా తొలి భాగం 'బాహుబలి ది బిగినింగ్' పాటల విడుదల కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్లో జరగనుంది. ఇదే వేదికపై రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివితో సాగే థియేట్రికల్ ట్రైలర్ని కూడా విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''మా 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు రాజమౌళి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు.
చిత్రం విశేషాలకు వస్తే....
ఆడియో లాంచ్ లో రిలీజ్ చేయనున్న ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యింది. ట్రైలర్ కి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయ్యిందని, సెన్సార్ వారు ‘యు/ఏ' ఇచ్చారని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు. ఈ ట్రైలర్ రన్ టైం 2 నిమిషాలు ఉంటుందని సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్స్ బయిటకు రావటంతో అందరిలో ఓ రేంజిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోపై అనంతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ఆడియోకు తమిళ,తెలుగు,హిందీ పరిశ్రమల నుంచి ప్రముఖులు వస్తూండటంతో ఆడియో లైవ్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు అన్ని ఛానెల్స్ పోటీ పడ్డాయి.

అయితే తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ రేటు ఒక కోటి అని తెలుస్తోంది. కోటి రూపాయలు ఓ ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ కు పలకటం సాధారణ విషయం కాదు అంటున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్రబృందం వినూత్నంగా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్కుమార్, ఎస్.ఎస్.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్కు వెళ్లింది. అక్కడ కేన్స్ ప్రతినిధి క్రిస్టియన్ జేన్ను కలిశారు.
ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్నైట్ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.
భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్లైన్లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.
అలాగే... 'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు. 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్ సంస్థ చేజిక్కించుకొంది. ''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంద''న్నారు లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్నాయుడు.


Click it and Unblock the Notifications











