సముద్రఖని దర్శకత్వంలో నాని చిత్రం ఖరారు
ఈగ చిత్రంతో మంచి జోరు మీద ఉన్న హీరో నాని మరో చిత్రం కమిటయ్యారు. శంభో శివ శంబో,సంఘర్షణ చిత్రాలు డైరక్ట్ చేసిన సముద్రఖని నాని తన బైలింగ్వల్ చిత్రంలోకి తీసుకున్నారు. ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయమై నాని మాట్లాడుతూ....త్వరలో సముద్రకని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాను. నా కెరీర్లో సవాల్తో కూడుకున్న పాత్ర ఇదే. ప్యాక్ బాడీ కంటే ఎక్కువ కష్టపడాల్సిన ఓ ఎపిసోడ్ ఇందులో ఉంది. మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి అన్నారు.
ప్రస్తుతం నాని కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి నాని చెపుతూ...ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. వినోదాత్మకంగా సాగుతూనే ఉత్కంఠ కలిగిస్తుంది. ఆయన ప్రతి చిత్రాన్ని కొత్త తరహాలో తెరపై ఆవిష్కరిస్తారు. ఇది కూడా ఓ ప్రయోగాత్మక వాణిజ్య చిత్రం అన్నారు. ఇక ఈ చిత్రానికి పైసా అనే టైటిల్ ని పెట్టనున్నట్లు సమాచారం.
మరో ప్రక్క నాని...తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రంలో నానితో సమంతతో మరోసారి నటించడం నుంది. ఆ సినిమా గురించి చెబుతూ..సంపూర్ణమైన ప్రేమ కథా చిత్రమిది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ చాలా చక్కగా తెరకెక్కించారు అన్నారు.
ఇక 'ఈగ'లో నాని పాత్రకు స్పందన గురించి చెపుతూ...ప్రేమ సన్నివేశాల్లో నా నటన చూసి 'మౌనరాగం'లో కార్తీక్ గుర్తుకొచ్చాడన్నారు. సమంత, నా మధ్య మరో రెండు ప్రేమ సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండునని చెబుతున్నారు. ఓ నటుడికి ఇంతకంటే ఇంకేం కావాలి. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ, ఉత్తరాదిన కూడా 'ఈగ'కి మంచి స్పందన లభించింది. కర్ణాటకలో ఈ సినిమా చూసిన కొంతమంది నిర్మాతలు నేను గతంలో నటించిన 'అష్టాచెమ్మా' రీమేక్ హక్కులు కావాలని ఆ చిత్ర నిర్మాతని అడుగుతున్నారట. అంతలా నాని అంటే దక్షిణాది అంతటికీ తెలిసేలా చేసిందీ చిత్రం అన్నారు.


Click it and Unblock the Notifications











