నారా రోహిత్ 'ఒక్కడినే' స్టోరీ లైన్
నారా రోహిత్ హీరోగా గులాబీ మూవీస్ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఒక్కడినే'. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కథ...సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది.
ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. మా దర్శకుడు శ్రీనివాస్ రాగ ఎక్కడా, దేనికీ రాజీపడకుండా చిత్రీకరించారు. తప్పకుండా ఇది ఇంటిల్లిపాది మెచ్చేటువంటి అపురూప కథా చిత్రం అవుతుందని నా నమ్మకం.
ఈ సినిమాపై అంచనాలు అదికంగా బాగా ఉన్నాయి. దీనికి కారణం నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు. ఈ రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఆడియో సైతం త్వరలో విడుదల చేసి పబ్లిసిటీ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నిత్యా మీనన్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 29న రామోజీ ఫిల్మ్సిటీలో మొదలైన మూడో షెడ్యూల్ మే 26 వరకు జరిగింది. దీనితో క్లైమాక్స్, 3 పాటలు చిత్రీకరణ మినహా మొత్తం సినిమా అయిపోయింది. ఇక పాటల్ని క్లైమాక్స్ని జూన్ నెలలోనే పూర్తిగావిస్తారు. శబ్దాలయా థియేటర్లో జూన్ 4 నుంచి డబ్బింగ్ పనుల్ని మొదలుపెడుతున్నారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్యపాత్రల్ని చేసారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, ఛాయాగ్రహణం: ఆండ్రుబాబు, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్: కళ్యాణ్, ప్రొడక్షన్: తాండవకృష్ణ పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు. నిర్మాత: సి.వి.రెడ్డి, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.


Click it and Unblock the Notifications











