చిరు ఫ్యామిలీ హీరోల వల్లే చిత్ర పరిశ్రమ చిత్తు: నట్టి కుమార్
ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవిపై తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిరంజీవి ఫ్యామిలీ హీరోల వల్లనే సినీ పరిశ్రమ నాశనమైందని ఆయన అన్నారు. రైతు సమస్యల గురించి మాట్లాడుతున్న చిరంజీవి సినీ రంగంలో నష్టపోతున్న నిర్మాతలు, ఎగ్గిబిటర్లు, పంపిణీదారుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. ఖలేజా, కొమరం పులి, ఆరెంజ్ సినిమాలు చిత్ర పరిశ్రమను నాశనం చేశాయని ఆయన ఆరోపించారు. ఈ సినిమాలకు 120 కోట్లు ఖర్చు చేస్తే 50 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు. చిత్ర పరిశ్రమను చిరంజీవి కుటుంబం శాసిస్తోందని, చిత్ర పరిశ్రమ నాశనానికి చిరంజీవి కుటుంబమే కారణమని ఆయన అన్నారు. నష్టపోయిన నిర్మాతలకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజా తిరిగి డబ్బులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్ర పరిశ్రమ నాశనం కావడానికి కారణమెవరో మూడు రోజుల్లో వెల్లడిస్తానని ఆయన హెచ్చరించారు. సినీ పరిశ్రమ సమస్యలపై తాను అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. హీరోలు, దర్శకులే చిత్ర పరిశ్రమ దెబ్బ తినడానికి కారణమని ఆయన అన్నారు. హీరోలు, దర్శకులు బాగుపడుతుంటే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. సినిమా విజయానికి హీరోలు ముఖ్యం కాదని, కథ ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ థియేటర్లకు16 వారాల పాటు పర్సెంటేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. థియేటర్ల నష్టాల్లో సగం భరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కథానాయకుడు, బాబా సినిమాలకు నష్టపోతే రజనీకాంత్ తిరిగి డబ్బులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications











