Sushant Singh Rajput సుశాంత్తో అలాంటి అనుబంధం.. ఇప్పుడు ఆయన లేడంటే? నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
జాతిరత్నాలు సినిమాతో బ్లాక్బస్టర్ అందుకొన్న నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్పై నూతన దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సందర్బంగా మీడియా ఫ్రెండ్స్తో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినట్టు ప్రకటన చేయించారు. ఈ సందర్బంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ...
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన స్పందనతో మాకు ఈ సినిమాపై భారీ నమ్మకం కలిగింది. ఈ సినిమాను మరింతగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని స్టాండప్ టూర్ ప్లాన్ చేశాం. ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు తిరిగాం. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్లో విశేషమైన ఆదరణ లభించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కృష్ణాష్టమి రోజు విడుదల అవుతున్నది. కృష్ణుడి అల్లరి ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో కూడా అంతే అల్లరి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన యూఎస్ టూర్కు వెళ్తున్నాం. డల్లాస్లో తొలి ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం అని నవీన్ పోలిశెట్టి చెప్పారు.

మూవీ ప్రమోషన్ అనేది సినిమాను ప్రేక్షకులకు దగ్గరగా చేసే బ్రిడ్డి లాంటింది. ఎవరు ప్రమోషన్ చేస్తున్నదనే విషయాన్ని పట్టించుకోకుండా మూవీని ఆడియెన్స్కు ఎంత దగ్గర చేశామనేది ముఖ్యం. సినిమా నచ్చితే ప్రేక్షకులు ఓ రేంజ్లో బాక్సాఫీస్ వద్దకు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 7వ తేదీన షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా రిలీజ్ అవుతున్నది. షారుక్ ఖాన్ నేను పెద్ద అభిమానిని. మధ్య తరగతి కుటుంబం నుంచి సూపర్ స్టార్గా ఎదిగిన అందరికి ఆదర్శం అని నవీన్ పొలిశెట్టి అన్నారు.
దర్శకుడు మహేష్ బాబు చెప్పిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథలో స్టాండప్ కామెడీ క్యారెక్టర్ నన్ను ఆకట్టుకున్నది. స్టాండప్ కామెడీకి మంచి డిమాండ్ ఉంది. తెలుగు ఆడియెన్స్కు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. రియల్గా స్టాండప్ కామెడి స్టూడియోస్లో షూట్ చేశాం. స్టాండప్ కామెడీని కరెక్ట్గా చేయాలని రీసెర్చ్ జరిపి, పక్కాగా చేశాం అని నవీన్ పొలిశెట్టి తెలిపారు.

సాధారణంగా టాలీవుడ్లో సినిమాలు చేసి బాలీవుడ్కు వెళ్తుంటారు. కానీ నేను రివర్స్ చేశాను. నితిన్ తివారీ సినిమాలో నటించడానికి ముందు చాలా ఆడిషన్స్ చేశాను. ఆ తర్వాత ఆయన సినిమాలో ఆఫర్ లభించింది. ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. నేను ముందు నుంచి తెలుగు, హిందీ నాటకాలు వేశాను. బాలీవుడ్లో కథలు వింటున్నాను. మంచి కథ దొరికితే ఆ సినిమా చేస్తాను. నాకు చాలా రీమేక్ ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల చేయడం లేదు. ఒక ఒరిజినల్ సినిమాకు బయట నుంచి కూడా టాక్ వస్తే దాని వల్ల వచ్చే కిక్ బాగుంటుంది అని నవీన్ పోలిశెట్టి అన్నారు.
హిందీలో చిచ్చోరే సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో సినిమా చేశాను. నేను, సుశాంత్, నితీన్ తివారీ ముగ్గురం ఇంజినీరింగ్ స్టూడెంట్స్. నితిన్ ఐఐటీ బాంబేలో చదువుకొన్నారు. మేము ముగ్గురం చిచ్చోరే సినిమా షూటింగ్ చేసేటప్పడు... ఇంజినీరింగ్ కాలేజీలో ఉండే ప్రెజర్, హాస్టల్లో ఉండే పరిస్తితులను, పరీక్షలు రాసే విధానం చర్చించుకొనే వాళ్లం. దాంతో మేము ముగ్గురు కనెక్ట్ అయ్యాం అని సుశాంత్ సింగ్ రాజ్పుత్తో అనుబంధాన్ని చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ షూటింగ్కు వచ్చే ప్రతీ రోజు కొన్ని పజిల్స్ తెచ్చేవాడు. వాటిని మేము ముగ్గురం కలిసి సాల్వ్ చేసేవారం. షూటింగులో మిగితా వాళ్లకు మేము మాట్లాడుకొనే సబ్జెక్ట్ అర్ధం కాకపోయేది. కెప్లెర్ లా, ఈక్వేషన్స్ ఏమిటి? అని అడిగే వారు. శ్రద్దా కపూర్ వచ్చి ఏం చేస్తున్నారని అడిగి వెళ్లేది. అలాంటి ఎంజాయ్, బాండింగ్తో సినిమా చేశాను. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్పుత్ మన మధ్య లేడు. సుశాంత్ను ప్రతీ రోజు మిస్ అవుతుంటాను అని నవీన్ పోలిశెట్టి చెప్పారు.


Click it and Unblock the Notifications











