Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పార్లమెంట్లో తెలుగులో మాట్లాడిన నవనీత్ కౌర్.. ఇరు రాష్ట్రాల్లోని ప్రజల మనసు దోచిన ఎంపీ
Recommended Video
భారత పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన ఓ ఎంపీ స్పీచ్ తెలుగు వారిని ఆకట్టుకుంది. దీనికి కారణం ఆమె మన భాషలో మాట్లాడడమే. ఇంతకీ ఆమె ఎవరనేగా మీ సందేహం..? ఆమె మరెవరో కాదు.. తెలుగు చిత్ర సీమలో పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్.
టాలీవుడ్లో ఎన్నో సినిమాలు
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన ‘శీను వాసంతి లక్ష్మీ' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నవనీత్ కౌర్. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించారు. అయినా, సరైన గుర్తింపు అయితే రాలేదు. కానీ, బాలయ్య సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. వీరిద్దరూ ‘మహారథి' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘జగపతి', ‘నిర్ణయం', ‘యమదొంగ', ‘రూమ్మేట్స్' తదితర చిత్రాల్లో నటించారు.
పొలిటీషియన్తో వివాహం
బాబా రాందేవ్ను ఫాలో అయ్యే నవనీత్ కౌర్కు యోగా క్యాంపులో రాజకీయ నాయకుడైన రవి రాణాతో పరిచయం ఏర్పడింది. తర్వాత 2011లో బాబా రాందేవ్ సమక్షంలోనే వాళ్లిద్దరూ పెళ్లాడారు. అలా ఆమెకు రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది. ఆమె భర్త రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్గా విజయం సాధించడం గమనార్హం.
ఎన్సీపీలో చేరిక
నవనీత్ కౌర్ 2010 వరకు టాలీవుడ్లో సినిమాలు చేశారు. తర్వాతి సంవత్సరం వివాహం అవడంతో భర్తతో పాటు రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. దీంతో 2014 ఎన్నికలకు ముందు ఆమె శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు.
స్వతంత్ర అభ్యర్థిగా విజయం
అప్పటి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈ ఎన్నికల్లో మాత్రం ఆమెను విజయం వరించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఐదుసార్లు ఎంపీగా పని చేసిన శివసేన సీనియర్ నాయకుడు ఆనందరావు విఠోబాను ఓడించారు. ఆమె భర్త గతంలో పోటీ చేసిన నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలో ఉండడం ఆమెకు బాగా కలిసొచ్చింది.
అదిరిపోయే స్పీచ్ - తెలుగు వారు ఫిదా
నవనీత్ కౌర్ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. పార్లమెంట్లో మోదీకి వేలు చూపెడుతూ మాట్లాడారు. ఇక, మంగళవారం చర్చలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో ఓ తెలుగు ఎంపీ అడ్డుతగలబోగా.. నవనీత్ కౌర్ సదరు ఎంపీకి తెలుగులోనే సమాధానం చెప్పారు. ‘రెండు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. నాకు కూడా తెలుగు తెలుసు. మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు ఒప్పుకుంటా. నేను కూడా అపోజిషన్లోనే ఉన్నా. ఇండిపెండెంట్గా ఉన్నా. నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డు రావద్దు' అంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.