Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భూకంపం దుర్ఘటన లో చనిపోయిన విజయ్ ఇతనే
హైదరాబాద్ : : నేపాల్ భూకంపం దుర్ఘటనలో 'ఎటకారం' చిత్ర నృత్యదర్శకుడు కావిట్య విజయ్సింగ్(20) మృతి చెందారు. నేపాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనల ధాటికి ఎటకారం చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయ్ మృతి చెందాడు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో మార్కెట్ ప్రాంతానికి చెందిన విజయ్సింగ్కు చిన్నతనం నుంచి నృత్యం అంటే చాలా ఇష్టం. సినీ నటుడు ప్రభుదేవాను స్ఫూర్తిగా తీసుకుని నృత్యాలు నేర్చుకొని గత ఐదారేళ్లుగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. 'ఎటకారం' సినిమాను విజయ్సింగ్ బాబాయ్ కిషన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి నృత్య దర్శకుడిగా పని చేసే అవకాశం లభించించడంతో ఈ నెల 20న చిత్రీకరణ కోసం చిత్ర బృందంతో కలిసివిజయ్ నేపాల్ వెళ్లాడు. శనివారం ఉదయం నేపాల్లో భూకంపం సంభవించగానే ఆందోళనకు గురైన తల్లితండ్రులు విజయ్తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సిగ్నల్ అందకపోవడంతో మాట్లాడలేకపోయారు. హైదరాబాద్లో ఉన్న సినిమా నిర్మాతకి ఫోన్ చేయగా అందరు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. కుమారుడు క్షేమంగా ఉన్నారని తల్లిదండ్రులు వూపిరి పీల్చుకున్నారు.
ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కాఠ్మాండు నుంచి విజయ్ మాట్లాడాడు... బయపడవద్దని వచ్చేస్తున్నానని ధైర్యం చెప్పాడు. తర్వాత పలుమార్లు విజయ్ ఫోన్ కలవలేదు. సోమవారం తెల్లవారుజామున దిల్లీకి బయలు దేరిన సమయంలో వచ్చిన భూప్రకంపనలకు చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విజయ్సింగ్ చనిపోయినట్లు బాపట్లలో ఉన్న అతని తల్లిదండ్రులకు నిర్మాత కిషన్ ఈ రోజు ఉదయం 5గంటలకు సమాచారం అందించారు.
తమ కుమారుడు క్షేమంగా వస్తాడని భావించిన విజయ్ తల్లిదండ్రులు గౌరిభాయి, రాజాసింగ్లు విషాద వార్త తెలుసుకుని దుఃఖసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పూర్తి సమాచారం తెలియజేసి, విజయ్సింగ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నెలక్రితం బాపట్లలో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన విజయ్సింగ్ విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇచ్చి వెళ్లారని... అతని జ్ఞాపకాలను తలచుకుంటూ స్నేహితులు, బంధువులు విలపించారు.
హైదరాబాద్ ఇందిరానగర్లోని ఎటకారం సినిమా కార్యాలయం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. నృత్యదర్శకుడు విజయ్ మృతివార్త తెలుసుకుని ఎటకారం చిత్ర నిర్మాత కిషన్ కవాడియా, చిత్ర యూనిట్ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మృతుడు విజయ్ నిర్మాత కిషన్ కవాడియాకు స్వయానా అన్న కుమారుడు. విజయ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులు కార్యాలయానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
నేపాల్ వెళ్లిన బృందంలో డైరెక్టర్ వీరేందర్రెడ్డి, హీరో దినేష్, హీరోయిన్ హరిత, కెమెరామన్ రంజిత్, టెక్నీషియన్లు భరత్, విజయ్, నవీన్ తదితరులు ఉన్నారు.
భూకంపం ధాటికి విలవిల్లాడిన నేపాల్ భయంతో బిక్కుబిక్కుమంటోంది. ప్రకంపనల భయంతో ప్రజలంతా చలి రాత్రిలోనూ ఆరు బయటే ఉన్నారు. పులి మీద పుట్రలా వర్షం ముంచెత్తుతోంది. శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాలతో ఉన్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. స్థానికులు, పర్యాటకులు కూడా తోడ్పాటునందిస్తున్నారు. అయితే తాజా ప్రకంపనలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, పర్వతాల్లో హిమపాతంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
హోంశాఖకు తాజాగా అందిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 2,430కు పెరిగింది. ఒక్క కాఠ్మాండూ లోయలోనే 1,053 మంది మరణించారని తేలింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులున్నారని అధికారులు వెల్లడించారు. అందులో భారత దౌత్యకార్యాలయం ఉద్యోగి కుమార్తె ఒకరు. మృతుల సంఖ్య పెరిగిపోతుండడంతో సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.
ఆదివారం 6.7, 6.5, 5.4 తీవ్రతతో వరుసగా మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. శనివారం వచ్చిన భారీ భూకంపం, ఆదివారం వచ్చిన రెండు బలమైన ప్రకంపనాలతో హిమాలయ దేశం శిథిలాల మయమయింది. దాదాపు 30లక్షల మంది నివాసముండే దేశ రాజధాని కాఠ్మాండూలో వీధులన్నీ కూలిన భవంతులతో కనిపించాయి. విద్యుత్తు తీగలు తెగిపోయి, విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో దేశమంతా అంధకారం నెలకొని ఉంది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు మరి కొన్ని రోజులు పట్టవచ్చని అధికారులు చెప్పారు.
అంతర్జాలం, మొబైల్ కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బ తినడంతో సమాచారం అందక తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. నేపాల్లో మొత్తం 26 జిల్లాలపై భూకంపం ప్రభావం తీవ్రంగా ఉంది. క్షతగాత్రులు వేల సంఖ్యలో ఉండడంతో వారందరినీ చేర్చుకోవడానికి ఆస్పత్రుల సామర్థ్యం చాలడం లేదు. ఆస్పత్రుల్లో నేలపైన, ఆస్పత్రుల ఆరుబయట కూడా పడి ఉన్నారు. ఎవరెస్టు శిఖరంపై భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 22 మంది మరణించారు.
తాజా ప్రకంపనలతో త్రిశూలీ జల విద్యుత్తు ప్రాజెక్టు వద్ద సొరంగం కూలి 60 మంది కూలీలు చిక్కుకుపోయారని తెలుస్తోంది. నేపాల్ సందర్శనకు వెళ్లిన పలువురు భారతీయులు ఆహారం, పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.