నేషనల్ అవార్డు సినిమాకు బయ్యర్లు కరువు
హైదరాబాద్: రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా బంగారు తల్లి' జాతీ అవార్డుల రేసులో తెలుగు సినిమా సత్తాను చాటిన సంగతి తెలిసిందే. 2013 సంవత్సరానికిగాను జరిగిన జాతీయ అవార్డుల రేసులో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అంజలి పాటిల్ స్పెషల్ జ్యూరీ అవార్డు చేజిక్కించుకున్నారు.
ఎంతో మంచి చిత్రంగా పేరు తెచ్చుకుని జాతీయ అవార్డు సైతం దక్కించుకున్న ఈచిత్రానికి ఇపుడు బయ్యర్లు కరువయ్యారు. సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. కేవలం డబ్బు, లాభార్జన అనే రెండు అంశాల చుట్టు తిరిగే మన సినిమా రంగంలో ఒక మంచి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం పెద్దగా ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ కాకపోయినా.....మంచి సినిమాలను బత్రికించాలనే జిజ్ఞాస రాను రాను పరిశ్రమలో తగ్గిపోతుండటం ఆందోళనకర అంశమే.

సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి బయ్యర్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం సినిమా థియేటర్లన్నీ కొంతమంది గుత్తేదార్ల చేతుల్లో ఉండటమే ఈ పరిస్థితి కారణమని నిర్మాత రాజేష్ టచ్ రివర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజెప్పేదిగా ఉంటుందని తెలిపారు. సిద్ధిక్, అంజలి పాటిల్, నైనా కృపా తదితరులు నటించిన ఈ చిత్రానికి శాంతను మోయిత్రా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ తులసి, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: డాన్ మాక్స్.


Click it and Unblock the Notifications











