100 కోట్లతో ధోని జీవితంపై సినిమా, దర్శకుడికి షాక్!
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్పాండే ఓ చిత్రానికి ప్లాన్ చేసుకోగా...బీసీసీఐ అతని ప్రయత్నాలకు తాత్కాలికంగా అడ్డు పడి షాక్ ఇచ్చింది. గతంలో ఈ దర్శకుడు హిందీలో ‘వెన్స్ డే' చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయం అందుకున్నారు.
ధోని క్రికెట్లో కొనసాగుతున్నంత కాలం ఆయన జీవితకథతో సినిమా తీయడానికి వీల్లేదని బి.సి.సి.ఐ. తేల్చి చెప్పింది. ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సినిమా నిర్మిస్తే తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించింది. దీంతో 100కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్లాన్ చేసారు.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో ధోని పాత్రను పోషించడానికి సుశాంత్సింగ్రాజ్పుత్ను ఎంపికచేశారు. చిత్ర హక్కుల కోసం ధోనికి 40కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెప్పారనే వార్తలు వినిపించాయి. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దర్శక నిర్మాతలకు మింగుడు పడటం లేదు.
మరి బీసీసీఐ విధించిన ఆంక్షలపై దర్శకుడు ఎలా స్పందించబోతున్నారనేది చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ధోనీ మంచి ఫాంలో ఉన్నందున సినిమా తీస్తే మంచి లాభాలు సంపాదించొచ్చు. మరి ధోని రిటైర్మెంటు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో? సినిమా వస్తుందో? రాదో? కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











