ఇంటర్వెల్ ఉండదు...బి రెడీ
హైదరాబాద్ : మన తెలుగులో వచ్చే చిత్రాలకు ఇంటర్వెల్ లేకుండా ఊహించగలమా.... ఊహించాలి అంటున్నారు వర్మ. ఎందుకంటే అలాంటి చిత్రం ఒకటి రెడీ చేసి,విడుదల చేస్తున్నారు ఆయన. రామ్గోపాల్ వర్మ నుంచి సినిమా వస్తోంది అంటే అందులో ఏదో ఒక కొత్తదనమో, వైవిధ్యమో ఉంటాయి. అలా ఈ సారి ఇంటర్వెల్ లేని చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అనుక్షణం'. మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. థ్రిల్లర్ తరహాలో సాగేచిత్రమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. అందుకే ఈ సినిమాకు విశ్రాంతి (ఇంటర్వెల్) ఇవ్వకుండా సెకండాఫ్(ద్వితీయార్ధం) కొనసాగించనున్నారు.

నిర్మాత,హీరో మంచు విష్ణు చెబుతూ ''థ్రిల్లర్ తరహా చిత్రాలు ఆంగ్లంలో ఎక్కువగా వస్తుంటాయి. వాటికి ఇంటర్వెల్ ఉండదు. మేమూ ఇదే ప్రయత్నం చేస్తున్నాము''అన్నారు అలాగే...‘ఐస్క్రీమ్'లా ఇది రూ. మూడు లక్షల్లో, ఏడు రోజుల్లో తీసిన సినిమా కాదన్నారు. అంతేకాదు ఈ సినిమాను వేలం ద్వారా అమ్మడమనే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. రాము ఈ ఐడియా చెప్పినప్పుడు టెన్షన్పడ్డాను. నాన్నగారికీ, దాసరి అంకుల్కూ ఈ పద్ధతి గురించి చెప్పినప్పుడు మంచి ఆలోచన అనీ, సక్సెస్ అయితే అందరికీ మార్గదర్శకులవుతారనీ ప్రోత్సహించారు'' అని ఆయన చెప్పారు.
చిత్రం కథ ఏమిటంటే... ‘‘హైదరాబాద్ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన ఓ సీరియల్ సెక్స్ కిల్లర్ కథ ఈ చిత్రం. ఈ కిల్లర్ కారణంగా రాత్రి ఏడు గంటల తర్వాత మహిళలు తమ ఇళ్లనుంచి బయటకు రావొద్దని పోలీస్ కమీషనర్ హెచ్చరించే స్థితి ఏర్పడుతుంది. రెస్టారెంట్లు ఖాళీ అయిపోతాయి. థియేటర్లలో రాత్రి ఆటలు రద్దవుతాయి. నగరం రాత్రివేళ నిర్మానుష్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మరింతమంది యువతులను చంపడానికి ప్రయత్నించే హంతకుణ్ణి పోలీసులు పట్టుకోగలిగారా, లేదా? అనేది ఇందులోని ప్రధానాంశం. పూర్తిగా సీరియల్ కిల్లర్ ప్రధానంగా భారతదేశంలో రూపొందిన మొదటి సినిమా ఇదే'' అని వర్మ తెలిపారు.
తేజస్వి, మధుశాలిని, రేవతి, నవదీప్ ఇతర ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. ఏవీ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











