అడ్డుకోండి: బాహుబలి పైరసీపై కోర్టు ఆదేశం
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' పైరసీ జోరుగా సాగుతున్న నేపథ్యంలో పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు హైదరాబాద్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బాహుబలి సినిమాకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ ఉంటే బ్లాక్ చేయడం లేదా, తొలగించడం చేయాలని తన ఆదేశాల్లో పేక్కొంది.
బాహుబలి చిత్రాన్ని పైరసీ చేయకుండా ఉండేలా ఆదేశించాలంటూ ఏ వెంకటేశ్ అనే పిటిషనర్ కోర్టులో పిటిషన్ వేయగా అడిషనల్ చీఫ్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మీ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బీఎస్ ఎన్ఎల్, రిలయన్స్ కమ్యునికేషన్స్, భారతీ ఎయిర్ టెల్ వంటి మొబైల్ ద్వారా ఆన్ లైన్ సేవలు అందించే సంస్థలకు ప్రత్యేక సూచనలు సూచించారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన 5 రోజుల్లోనే దాదాపు 230 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 స్థానంలో నిలవడంతో పాటు బాలీవుడ్లో పలు రికార్డులను తుడిచి పెట్టింది. బాహుబలి వసూళ్ల ప్రభంజనం ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో ఊహించనంతగా సాగుతోంది.
కాగా విశాఖలో బాహుబలి చిత్రాన్ని పైరసీ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు నేతృత్వంలో డాబాగార్డెన్స్ లోగల మొబైల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కంప్యూటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి బాహుబలి పైరసీని లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











