సుప్రీంకోర్టుకు వెళ్లను: కమల్హాసన్
చెన్నై: మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనని ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ ప్రకటించారు. 'విశ్వరూపం' సినిమా వివాదం నేపథ్యంలో చిత్ర విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తానని కమల్ నిన్న ప్రకటించారు. చిత్ర విడుదలపై చర్చలు జరుగుతున్నాయని, సుప్రీంకోర్టుకు వెళ్లదలచుకోలేదని ఈరోజు ఉదయం ఆయన ప్రకటించారు.
'విశ్వరూపం'లో మాదిరే తమిళనాడులో ఆ చిత్ర విడుదల వ్యవహారం కూడా మలుపులు తిరుగుతోంది. విడుదలకు మద్రాస్ హైకోర్టు నుంచి అనుమతి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు కమల్హాసన్కు మళ్లీ నిరాశ ఎదురైంది. తమిళనాడులో విశ్వరూపం విడుదలను నిలుపుదల చేస్తూ హైకోర్టు తాజాగా బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా సినిమాలో మార్పులు చేస్తామని అంగీకరించినా మళ్లీ అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో నిరాశకు గురైన కమల్ తమిళనాడును విడిచి వెళ్తానని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు అనుమతిస్తూ జస్టిస్ కె.వెంకట్రామన్ మంగళవారం రాత్రి ఇచ్చిన అనుమతిని.. బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎలిపే ధర్మారావు, జస్టిస్ అరుణా జగదీశన్లతో కూడిన ధర్మాసనం కొట్టివేస్తూ విడుదలను నిలిపివేసింది.
విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ వేచిచూసి, తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటామని కమల్ సోదరుడు చంద్రహాసన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు రాకముందే చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన రెండు థియేటర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. పరమకుడిలోని థియేటర్పై పెట్రోల్బాంబులు విసిరారు.


Click it and Unblock the Notifications











