ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా...ఎన్టీఆర్
ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా అభిమానం అనే ఒక చిన్న మాటతో... చేసే ప్రతి పనిలోనూ నేను విజయం సాధించాలని కోరుకొంటుంటారు నా అభిమానులు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓ మంచి చిత్రాన్ని తీస్తే... దాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించారు అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఆయన 'దమ్ము'చిత్రం విజయోత్సవాన్ని గురువారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే... పరిశ్రమలో అందరూ బాగుండాలి. అన్ని సినిమాలూ బాగా ఆడాలి అన్నదే నా భావన. నా సినీ జీవితంలో ఒక పెద్ద విజయం అందుకొన్న చిత్రం 'దమ్ము'. ఇందులో నటించడం గర్వంగా ఉంది. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. దీని వెనక ఎంతోమంది కృషి ఉంది.''అన్నారు ఎన్టీఆర్. ఇక పైరసీ గురించి చెప్తూ... ఎంత మంచి సినిమా తీసినా... మన పరిశ్రమకు పైరసీ ఒక భూతంలా తయారైంది. పైరసీ ఆపండని వేడుకొంటున్నాం. 'దమ్ము' పైరసీ గురించి మాత్రమే కాదు, పరిశ్రమలోని ప్రతి సినిమానీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. పైరసీ చేసేవాళ్లను ఆపలేకపోతున్నాం. కనీసం చూసేవాళ్లలోనైనా మార్పు రావాలని''అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...''నా గత మూడు చిత్రాలకి మించి 'దమ్ము'ని ఆదరించారు ప్రేక్షకులు. ఇకపై కూడా ఇలాంటి సినిమాలే తీస్తాను''అన్నారు . సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్తో నా అనుబంధం ఎప్పట్నుంచో కొనసాగుతోంది. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకు... అనే పాట ఆయనకి ఎంతో ఇష్టం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే వ్యక్తులే ఈ సినిమాకి పని చేశారని''అన్నారు . ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, కె.ఎ.వల్లభ, దిల్ రాజు, చంద్రబోస్, కె.ఎస్.రామారావు, కార్తీక తదితరులు పాల్గొన్నారు.
ఇక దమ్ము చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించగా క్రిందటి వారం రిలీజైంది. త్రిష,కార్తీక హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. సెకండాఫ్ కొద్దిగా వీక్ గా ఉండటం,క్లైమాక్స్ ఈ సినిమా విజయాన్ని అనుకున్నంతగా తేలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ లో భాగంగా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.


Click it and Unblock the Notifications











