రాజమౌళి-ఎన్టీఆర్ షార్ట్ ఫిల్మ్స్ విడుదల: అందులో విశేషాలు ఇవే....
దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈ లోగా ఈ ఇద్దరూ కలిసి ప్రజల్లో మోసాలు, నేరాలపై అవగాహన కల్పించే ఓ లఘు చిత్రం చేశారు. హైదరాబాద్ పోలీసు శాఖ చేపట్టిన అవేర్నెస్ కాంపెయిన్లో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో మొత్తం 5 లఘు చిత్రాలు రూపొందాయి. వీటిని సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రాల్లో రాజమౌళి, ఎన్టీఆర్, నిఖిల్, విజయ్ దేవరకొండ నటించారు. నేటి నుండే ఈ లఘు చిత్రాలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

రాజమౌళి కూడా నటించారు
ఐదు లఘు చిత్రాలకు రాజమౌళి దర్శకత్వం వహించగా ఓ లఘు చిత్రంలో రాజమౌళి స్వయంగా నటించారు. బ్యాకింగ్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అంశాలపై ఆయన ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

మాట్రిమోనియల్ మోసాలు
ఈ మధ్య కాలంలో మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పెళ్లి సంబంధాల విషయంలో చాలా మంది మోస పోతున్నారు. ఇందుకు సంబంధించి చిత్రీకరించిన యాడ్లో విజయ్ దేవరకొండ నటించారు.

మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలు
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు చిత్రీకరించిన యాడ్ ఫిల్మ్ లో హీరో నిఖిల్ నటించి అవగాహన కల్పించారు.

ఫేస్బుక్ మోసాలపై
ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లలో అపరిచితులు, మోసాలపై అవగాహన కల్పిస్తూ చిత్రీకరించిన లఘు చిత్రంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించారు. ఈ లఘు చిత్రాలు సమాజంలో జరుగుతున్న మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండేలా అప్రమత్తం చేస్తాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











