ఘనత సాధించాం: ‘బాద్ షా’ నిర్మాత ప్రకటన
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సూపర్ హిట్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'బాద్ షా' గత సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి గ్రాసర్గా నిలిచింది.
బాద్ షా చిత్రం తాజాగా ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014లో ప్రదర్శన కానుంది. మార్చి 7 నుండి 16వ తేదీ వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు మనదేశం నుండి రెండు సినిమాలే ఎంపిక కావడం గమనార్హం. అందులో ఒకటి హిందీ సినిమా 'భాగ్ మిల్ఖా భాగ్', రెండవది 'బాద్ షా'.

దక్షిణాది నుండి ప్రదర్శితమవుతున్న ఏకైక సినిమా ఇదే కావడం తెలుగు సినిమా అభిమానులు అనందించదగ్గ విషయమని నిర్మాత బండ్ల గణేష్ అంటున్నారు. ఆయన మాట్లాడుతూ...'ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్కి సౌతిండియాలో ఎంపికైన ఏకైక చిత్రంగా 'బాద్ షా' నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి అరుదైన ఘనతను 'బాద్ షా' దక్కించుకున్నందుకు ఎన్టీఆర్ గారికి, శ్రీను వైట్ గారికి 'బాద్ షా' టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.
జపాన్లో ఎన్టీఆర్ చిత్రాలకు ఆదరణ లభిస్తుందుకు హ్యాపీగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ 'బాద్ షా' చిత్రం ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపిక కావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని నిర్మాత బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. 'బాద్ షా' చిత్రం ఈ ఫెస్టివల్లో స్పెషల్ స్క్రీనింగ్ క్యాటగిరీలో ప్రదర్శితం కానుంది.


Click it and Unblock the Notifications











