నెట్టింట్లో ‘ఓకే బంగారం’ పైరసీ: కోర్టుకెక్కిన మణిరత్నం
హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ కాదల్ కన్మణి'(ఓకే బంగారం) సినిమా పైరసీకి గురైంది. దీంతో మణిరత్నం మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అశోక్ కుమార్ అనే గుర్తు తెలియని వ్యక్తి తన చిత్రం పైరసీ సీడీలను సృష్టించి వాటిని అంతర్జాలంలో పంపిణీ చేస్తున్నారని మణిరత్నం తన పిటీషన్లో పేర్కొన్నారు.
మణిరత్నం అభ్యర్థనను పరిశీలించిన కోర్టు...గూగుల్, ఫేస్ బుక్, యూట్యూడ్ తదితర ఇంటర్నెట్ ఆధారిత మీడియాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు ప్రసారం చేయకూడదని, ఎంఎంఎస్ పంపకూడదని మద్రాస్ హై కోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఈ సినిమాకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేస్తే యూఆర్ఎల్ నిలిపి వేయడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

‘ఓ కాదల్ కన్మణి' చిత్రాన్ని మణిరత్నం స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. ప్రఖ్యాత చాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.
తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' వారు ‘ఓకే బంగారం' పేరుతో విడుదల చేసారు. సినిమా విడుదలై వారం కాకముందే పైరసీకి గురి కావడం సినిమా నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











