లక్ష్మీస్ ఎన్టీఆర్కు మరో ఎదురుదెబ్బ.. ప్రీవ్యూ చూడలేం అని తేల్చేసిన హైకోర్టు!
అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల కాలేదు. తెలంగాణ, యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల కానుంది. తెలంగాణాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల ఆంధ్రాలో మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ చిత్రంపై విచారణని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోమారు వాయిదా వేయడంతో చిత్ర యూనిట్ కు నిరాశ తప్పలేదు.

చివరి నిమిషంలో
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం కూడా అడ్డు చెప్పలేదు. కానీ టిడిపి నేతలు ఈ చిత్ర విడుదలని అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. మార్చి 29 న ఈ చిత్రం విడుదల ఖాయం అనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్టే విధించింది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు.

మరోసారి నిరాశ
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సమయంలో ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని చూసి తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఈ లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. త్వరగా తన పిటిషన్ పై విచారణ జరపాలని రాకేష్ రెడ్డి సుప్రీంని కోరగా.. అంత తొందరేంటి అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.

ప్రివ్యూ చూడలేం
నేడు ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూసి విడుదలపై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ హై కోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ని నిరాశాని కలిగించేలా వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి మేము ప్రివ్యూ చూడలేం అని కోర్టు తెలిపింది. తదుపరి విచారణని ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికలకన్నా ముందు విడుదలవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

మోడీకి గ్రీన్ సిగ్నల్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించడంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ప్రధాని మోడీ బయోపిక్ చిత్రం పీఎం నరేంద్ర మోడీ చిత్రాన్ని ఉదహరిస్తూ.. పీఎం నరేంద్ర మోడీ చిత్రానికి బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని తెలియజేశాడు. సెన్సార్ సభ్యులు ఒకే చేసిన చిత్రాన్ని అడ్డుకోవడం కుదరదని ఎన్నికల సంఘం కూడా తెలిపింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మాత్రమే ఈ ఆంక్షలు ఏంటి అంటూ వర్మ ప్రశ్నించాడు.


Click it and Unblock the Notifications











