Padma Awards 2023.. కీరవాణికి పద్మ అవార్డు.. సినీ రంగంలో అవార్డులు ఎవరెవరికీ అంటే?
సినీ రంగానికి విశేష సేవలందించిన సినీ ప్రముఖులకు, కళాకారులకు భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 106 మంది ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు ఉండటం తెలిసిందే. సినిమా రంగం నుంచి ఎవరెవరూ పద్మ అవార్డులు అందుకొన్నారనే వివరాల్లోకి వెళితే..

జాకీర్ హుస్సేన్కు పద్మ విభూషణ్
హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్, వరల్డ్ మ్యూజిక్ రంగాలకు విశేష సేవలు అందించిన జాకీర్ హుస్సేన్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. గతంలో అంటే 1988లో పద్మ శ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డును ఆయన అందుకొన్నారు. ప్రపంచస్థాయిలో మ్యూజిక్ రంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. సినీ రంగంలో హీట్ అండ్ డస్ట్, ది ఫర్ఫెక్ట్ మర్డర్, తాండువిటేయ్ ఎన్నై (తమిళం), మాంటో లాంటి సినిమాలతో భాగస్వామ్యం పంచుకొన్నారు.

వాణీ జయరాంకు పద్మభూషణ్
భారతీయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రముఖ గాయనిగా, ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత గాయనిగా వాణి జయరాంకు గుర్తింపు ఉంది. ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతూ 10 వేలకుపైగా పాటలు పాడారు. కన్నడ, హిందీ తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యానా, అస్సామీ, తులు, బెంగాళీ భాషల్లో పాటలు పాడారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సుమన్ కల్యాణ్పూర్కు పద్మభూషణ్
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్పూర్కు పద్మ భూషణ్ ప్రకటించారు. హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మైథిలి, భోజ్పూరి, రాజస్థానీ, బెంగాళీ, ఒడియా, పంజాబీ భాషల్లో పాటలు పాడారు. జూనియర్ లతా మంగేష్కర్ అనే పేరు ఆమెకు ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

కీరవాణికి పద్మశ్రీ
టాలీవుడ్తో భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. బాహుబలి సిరీస్, అలాగే RRR చిత్రాలకు మ్యూజిక్ అందించిన కీరవాణి ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ రంగంలో గుర్తింపు పొందారు. ఇటీవల RRR చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొన్నారు. అలాగే ఆస్కార్ అవార్డుకు కూడా నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే.

రవీనా టాండన్కు పద్మశ్రీ
బాలీవుడ్ నటి, అందాల తార రవీనా టాండన్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల కేజీఎఫ్ చిత్రం ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు. తూ ఛీజ్ బడీ మస్త్ మస్త్ పాటతో యువతను ఉర్రూతలూగించారు. సినీ రంగానికి సేవలు అందించినందుకుగాను ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించనున్నారు.


Click it and Unblock the Notifications











