విజయ నిర్మలకు తీరని అన్యాయం... ప్రభుత్వాలు చిన్నచూపు.. వాళ్ల కంటే తక్కువా?
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దిగ్గజ మహిళ దర్శకురాలు విజయ నిర్మలకు ప్రత్యేకమైన స్థానం. తన ఆరు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో అరుదైన రికార్డులను ఘనతలను సొంతం చేసుకొన్నారు. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించారు. అయితే ప్రభుత్వ అవార్డుల విషయంలో దేశ సినీ చరిత్రలోనే ఎవరికీ జరుగని అన్యాయం విజయ నిర్మలకు జరిగిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు చేసిన అన్యాయం ఏమిటంటే..

200 చిత్రాలు.. 44 సినిమాలకు దర్శకత్వం
విజయ నిర్మల నటిగా సుమారు 200 పైగా చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగు, తమిళ మలయాళ చిత్రాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. దర్శకురాలిగా మీనా అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించారు. అప్పటి నుంచి 2009 వరకు మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువులు ఆరుకాయలు, హేమా హేమీలు, రాం రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది. భోగి మంటలు, లంకె బిందెలు, రెండు కుటుంబాల కథ అనే సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలుగా మిగిలిపోయాయి.

ప్రభుత్వాల చిన్నచూపు
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగానికి ఎంతో సేవ చేసిన ఆమెకు అవార్డుల విసయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూశాయనేది కాదనలేని వాస్తవమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ సినిమా చరిత్రలోనే 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా పేరొందిన విజయ నిర్మలకు పద్మ అవార్డుకు నోచుకోలేకపోవడం గమనార్హం.

ప్రతీ సంవత్సరం నిరాశే
ప్రతీ ఏటా పద్మ అవార్డులు వెల్లడించే వేళ ప్రతీసారి విజయ నిర్మల పద్మ అవార్డు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూసిన దాఖలాలు కోకొలల్లు. కేంద్ర ప్రకటించే పద్మ అవార్డుల్లో ప్రతీ సారీ ఆమెకు నిరాశే. అయినా తన విజయ నిర్మల అసంతృప్తిని బయటకు వెళ్లగక్కలేదని సినీ వర్గాలు పేర్కొంటాయి. మీడియాలో ఏనాడు తనకు అవార్డులు ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.

విద్యాబాలన్, కాజల్, టబు, ప్రియాంకకు పద్మశ్రీలు?
ఇటీవల సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన గ్లామర్ హీరోయిన్లు విద్యాబాలన్, కాజల్, టబు, ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, గాయని ఉషా ఉతప్, మధురు భండార్కర్, ప్రభుదేవా లాంటి ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. వీరికి దక్కడాన్ని తప్పు పట్టలేదు. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక చిత్రాలకు దర్వకత్వం వహించడమే కాకుండా, నటిగా తెలుగు, తమిళ, మలయాళంలో 200 సినిమాల్లో నటించి.. అన్ని అర్హతలు ఉన్న విజయ నిర్మలకు ఎందుకు ఇవ్వలేదనే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

ప్రతిభకు పట్టం కట్టకుండా
ప్రాంతాలు, కులాలు, మతాల, రాజకీయాల ప్రాతిపదికన పద్మ శ్రీ అవార్డులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తాయి. అయితే విజయ నిర్మల విషయాన్ని చూస్తే అది నిజమో అనే అనుమానం కలుగక మానదు. ఏది ఏమైనా తన జీవితాన్ని సినిమాగా మలుచుకొన్న విజయ నిర్మలకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వకపోతేనేమీ.. ప్రజలు కట్టబెట్టిన గౌరవం ఏమాత్రం తీసిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











