ఆ సినిమా అంతర్జాతీయ కుట్ర: హిందూ స్త్రీలని కించపరచటానికే, దర్యాప్తు చేయించండి
మొఘల్ చక్రవర్తులతో సాన్నిహిత్యం కోసం హిందూ ఆడవాళ్లు పడిచచ్చేవారన్న 'వికృతమైన' భావాన్ని ఇటువంటి సినిమాల ద్వారా ప్రచారం చేయడమే ఆ దుబాయ్ షేకుల ప్లాన్ అట.
దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్పుత్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో మహారాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీలమధ్య లవ్ సీన్స్ ఉన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. ఆ సన్నివేశాలను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పద్మావతి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రాజ్పుత్ కర్ని సేన భగ్గుమంది. పద్మావతి సెట్లో బీభత్సం సృష్టించింది. దర్శకుడు సంజయ్లీలా భన్సాలీపై దాడికి పాల్పడింది. చారిత్రక గాధలను తెరకెక్కించడంలో పేరుగాంచిన భన్సాలీపై దాడిని బాలీవుడ్ ఖండించింది.

సంజయ్ లీలా బన్సాలీ
ఒకపక్క అసలు సినిమా రిలీజ్ కాకుండా తాను చరిత్రను వక్రీకరించానని ఎలా నిర్థారణకు వస్తారని సంజయ్ లీలా బన్సాలీ ప్రశ్నించారు. దీపికా పడుకోన్ రణ్వీర్సింగ్, షాహిద్కపూర్వంటి భారీ తారాగణంతో దాదాపు 200 కోట్ల బడ్జెట్తో ‘పద్మావతి' రూపుదిద్దుకుంది.

దుబాయ్ నుంచి నిధులు
పద్మావతిని త్రీడీలో కూడా ప్రేక్షకుల మందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భన్సాలీని మళ్లీ వివాదాలు చుట్టుముట్టాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేయాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ చేశారు. హిందూ మహిళలను అవమానించే లక్ష్యంతో దుబాయ్ నుంచి నిధులు వస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

సినిమా హాళ్లను తగులబెడుతాం
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో పద్మావతి క్యారెక్టర్ ను కించపరిచారని - చరిత్రను వక్రీకరించారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు చూపించకుండా ఆ సినిమాను విడుదల చేయకూడదని - ఒకవేళ విడుదలైన సినిమా హాళ్లను తగులబెడుతామని కొందరు హెచ్చరికలు కూడా జారీచేశారు.

అంతర్జాతీయ కుట్ర
అయితే ఈ వివాదానికి స్వామి సరికొత్త రూపునిచ్చారు. ఈ సినిమా కు అసలు సిసలు నిర్మాతలు దుబాయ్ షేకులట. హిందూ మహిళల క్యారెక్టర్ ను దెబ్బ తీసేందుకు అరబ్బులు 'అంతర్జాతీయ కుట్ర` పన్ని పద్మావతిని నిర్మించారట.

హిందూ ఆడవాళ్లు పడిచచ్చేవారు
మొఘల్ చక్రవర్తులతో సాన్నిహిత్యం కోసం హిందూ ఆడవాళ్లు పడిచచ్చేవారన్న 'వికృతమైన' భావాన్ని ఇటువంటి సినిమాల ద్వారా ప్రచారం చేయడమే ఆ దుబాయ్ షేకుల ప్లాన్ అట. అందుకోసమే చరిత్రను వక్రీకరించి ఆ సినిమాలో పద్మిని క్యారెక్టర్ ని 'లోప్రొఫైల్'లో చూపించారని స్వామి ఆరోపిస్తున్నారు.

కుట్రలో భాగమే
గతంలో వచ్చిన జోధా-అక్బర్ కూడా ఇటువంటి కుట్రలో భాగమేనని యూపీఏ హయాంలోనే ఈ ట్రెండ్ ఊపందుకుందని స్వామి సెలవిచ్చారు. 'పద్మావతి` దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆర్ధిక లావాదేవీలపై ఈడీతో దర్యాప్తు చేయిస్తే అసలు గుట్టు రట్టవుతుందని చెప్పారు.

సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించింది
దుబాయ్ కుట్ర బయట పెట్టేలా దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్రానికి విన్నవించారు. మరోవైపు - పద్మావతి చిత్ర విడుదలను నిలిపివేయాలన్న పిటిషన్ ను దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించింది. సినిమాల విడుదల విషయంలో సెన్సార్ బోర్డు స్వేచ్ఛను తాము హరించబోమని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











