నమ్ముతారా? వార్తలు చదువుతోంది ఓ హిజ్రా
చెన్నై: టీవీ చరిత్రలోనే మొదటిసారిగా వార్తలు చదివే హిజ్రా... పద్మినీప్రకాశ్. సాధారణంగా హిజ్రాలు మాట్లాడితేనే చుట్టుపక్కలున్నవారు గేలి చేసి నవ్వుతారు. దీన్ని లెక్క చేయకుండా టీవీ ఛానెల్లో వార్తలు చదివే పనిలో నిమగ్నమైంది పద్మిని. లోటస్ ఛానల్లో ఉదయం ఏడు గంటల నుంచి 7.30 గంటల వరకు పద్మిని ప్రకాశ్ లైవ్ వార్తలు వినడానికి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు.
ఇదే నాకు దక్కిన గుర్తింపు అంటూ చిరునవ్వుతో చెబుతుందామె. ఆమె న్యూస్రీడర్గా మారి రెండు నెలలు కావస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో పనిచేస్తున్న లిప్ టీవీలో కొన్ని వారాల కిందట నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈమెను గురించి చర్చ జరిగింది. సుమారు 250కి పైగా వెబ్సైట్లలో పద్మిని ప్రకాశ్ని ప్రశంసించి రాసి తమ అభినందనలు నమోదు చేశారు.

యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా పలు రకాలుగా ఈమెపై అభినందనల జల్లు కురుస్తూనే ఉంది. హిజ్రాలలో మొదట వార్తలు చదివేదానిగా ఉంటానని కలలో కూడా వూహించలేదని చెబుతోంది పద్మిని ప్రకాశ్. ఇద్దరు యువకులు కొన్ని నెలల కిందట తన ఇంటికి వచ్చి టీవీఛానెల్లో వార్తలు చదవడానికి తనను ఆహ్వానించినప్పుడు నమ్మశక్యం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను గేలి చేయడానికే అలా పిలుస్తున్నారని అనుకున్నది.
హిజ్రాలపై ఉన్న వివక్షను తొలగించేందుకు 'తాయ్' సంస్థలో చేరి అవగాహన ప్రచారంలో పాల్గొన్నట్టు చెబుతున్న పద్మినికి ప్రచార చిత్రాల్లో నటించడానికి ఆహ్వానం వచ్చింది. మదుపానక్కడై అనే సినిమాలో నటించింది. జీ తమిళ్ ఛానల్లో రుద్ర ధారావాహికలో ఏడాదిపాటు నటించింది. సాలమన్ పాపయ్య చర్చావేదికలో హిజ్రాల దయనీయస్థితిని గురించి మాట్లాడి పలువురిని ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











