Wayanad Floods: మానవత్వం చాటుకున్న ప్రభాస్.. కేరళ వరద బాధితులకు కోట్లలో భారీ విరాళం
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 400కి చేరిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అడుగుల మేర మేట వేసిన బురద, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్, కేరళ అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు.
నామ రూపాలు లేకుండా పోయిన ఈ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దింపింది. మిలటరీ ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపదికన వంతెలను నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల తాళ్ల సాయంతో తాత్కాలిక వంతెనలను నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి హృదయ విదారక పరిస్ధితులతో కలత చెందిన ఓ వైద్యురాలు పోస్ట్మార్టం చేయలేక ఆ ప్రాంతం నుంచి పారిపోవాలని భావించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పుల వల్ల కొండ చరియలు విరిగిపడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం, స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి, కుండపోత వర్షాలు కురిసి కొండ చరియలు విరిగిపడ్డాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో డార్క్ టూరిజం మాట వినిపిస్తోంది. విపత్తు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించవద్దని , సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని పోలీసులు ఎక్స్ వేదికగా అభ్యర్ధిస్తున్నారు. సమూహిక మరణాలు, విషాదం, హింస , అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే డార్క్ టూరిజం అంటారు.
మరోవైపు ప్రకృతి విలయతాండవంతో కకావికలమైన కేరళను ఆదుకోవడానికి కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అలాగే చిత్ర పరిశ్రమ కూడా బాధితులకు బాసటగా నిలిచింది. కేరళలో సినీ కార్యక్రమాలు, షూటింగ్లను కొన్ని రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మల్లూవుడ్ ప్రకటించింది. అలాగే పలువురు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలిచారు. మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ ఆర్మీ యూనిఫాం వేసుకుని స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

ఇక తనను మల్లు అర్జున్ అంటూ అప్యాయంగా పిలిచే కేరళ ప్రజలు కష్టంలో ఉండటంతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సంయుక్తంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ లిస్ట్లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరారు. వయనాడ్ బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. దీంతో డార్లింగ్ మంచి మనసుపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ -2, ది రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











