ఆచార్యలో ఒకేపనికి ఇద్దరు స్టార్లు అవసరమా?.. అదే దెబ్బ వేసిందేమో? పరుచూరి ఆసక్తికర విశ్లేషణ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఆచార్య చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణాలు అనేకం ఉన్నా సరే తన వెర్షన్ వినిపించారు సీనియర్ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తన యూట్యూబ్ ఛానల్ పరుచూరి పాఠాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో విడుదల చేసిన ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

చర్చోపచర్చలు
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే టైటిల్ రోల్ పోషించగా సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ అంచనాలను అసలు అందుకోలేకపోయింది. అయితే ఈ విషయం మీద అనేక చర్చోపచర్చలు జరిగాయి కానీ తాజాగా తన వర్షన్ వినిపించారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

ఆలయం, దోపిడీ నేపథ్యంలో
ఆచార్య సినిమా ఇటీవలే చూశానని పేర్కొన్న ఆయన ఆ సినిమా చూస్తున్నంత సేపు చాలా కాలం క్రితం తాము రాసిన మరో మలుపు అనే సినిమా గుర్తుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ మరో మలుపు సినిమాలో ఆలయం, దోపిడీ నేపథ్యంలో నక్సలైట్ గా శివకృష్ణ ఎంట్రీ ఉంటుందని అయితే ఆ సినిమాకు అపూర్వ ఆదరణ లభించింది అనే విషయాన్ని గుర్తు చేశారు. 80లలో కమ్యూనిస్టు సినిమాలు ఎక్కువగా వచ్చేవి కానీ తర్వాత సినిమాలు అలాంటి తరహా సినిమాలు చేయడం మానేశారు.

సినిమా విజయం మీద
కానీ అలాంటి సినిమా తెరకెక్కించాలననే కోరిక కొరటాల శివకు కలగడం దానికి చిరంజీవి గారు అంగీకరించడం కూడా చాలా గొప్ప విషయాలని పరచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియకుండా కథ నడిపితే వాళ్ళు అయోమయానికి లోనవుతారని ఆ ప్రభావం సినిమా విజయం మీద కూడా పడుతుందని పేర్కొన్నారు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అది కూడా ఒక కారణం
సస్పెన్స్ సెంటిమెంటు ఒక ఒరలో ఇమడవు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్న పరుచూరి గోపాలకృష్ణ చరణ్ పాత్ర మొదటి భాగంలో అక్కడక్కడ కొంతవరకు చూపిస్తే బాగుండేదని ప్రేక్షకులు కొంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేదని అన్నారు.. కానీ సెకండ్ హాఫ్ వచ్చేవరకు రామ్ చరణ్ పాత్రను దాచి ఉంచడం వల్ల ప్రేక్షకులు కనెక్టివిటీ మిస్ అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కాలం కుర్రవాళ్ళకి అభ్యుదయ భావాలు, కమ్యూనిజం కథలు చెప్తా అంటే వాళ్ళు వింటారా? వాళ్ళు వినరు కదా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకో లేకపోవడానికి అది కూడా ఒక కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు.

సెట్ కాలేదేమో
అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ చేత సిద్ధ పాత్ర చేయించుకోకుండా ఉంటే బాగుండేది. చిరంజీవి గారికి 90% ప్రాధాన్యత ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ కేవలం 10 శాతం కేటాయించి ఉంటే ఈ సినిమా రిజల్టు వేరేగా ఉండేదనేది తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఒకే పని చేయడానికి ఇద్దరు స్టార్లు అవసరం లేదన్న పరుచూరి గోపాలకృష్ణ దానికి ఒకరు చాలానీ పేర్కొన్నారు. ఈ సినిమాలో, అసలు పాటలు తనకు ఎక్కలేదని ఆచార్య స్థానంలో ఉన్న చిరంజీవి స్టెప్పులు వేయకుండా కాస్త హుందాగా నడుచుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి ఈ కథాంశం అలాగే ఆచార్య టైటిల్ రెండు కూడా సెట్ కాలేదేమో అని అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











