ఆ రోజు రాత్రి ఎన్టీఆర్కు జరిగిన అవమానం, కళ్లలో నీళ్లు తిరిగాయి: పరుచూరి
'పరుచూరి పలుకులు' పేరుతో తన సినీ ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేసుకుంటూ నిన్నటి తరంలో జరిగిన విషయాలను ఈ తరం ప్రేక్షకులకు తెలియజేస్తున్న ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ... ఎన్నికల వేళ ఎన్టీ రామారావుకు సంబంధించిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు.
ఎన్నికలు వస్తే నాకు అన్నగారే(ఎన్టీ రామారావు) గుర్తుకు వస్తుంటారు. ఆయనతో మహాసంగ్రామం సింగిల్ హీరోగా కథ చెబుతున్నపుడు బావుందని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన చేస్తారు అనుకున్న రోజే రాజకీయాల్లోకి వెళుతున్నారనే విషం తెలిసిందని... పరుచూరి గుర్తు చేసుకున్నారు.

నా కోసం ఇంత చేసిన ప్రజలకు ఏదైనా చేయాలి అన్నారు
ఎందుకు అన్నగారు.. మిమ్మల్ని ఒక రాముడుగా, కృష్ణుడుగా చూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళితే సగం మంది శత్రువులు అయిపోతారు అని నేను అంటే ఆయన ఒక మాట చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం కోసం ఏదైనా చేసిన వారి విగ్రహాలు ఉన్నాయే తప్ప సినిమా హీరోల విగ్రహాలు లేవు బ్రదర్. నా కోసం ఇంత చేసిన ప్రజలకు ఏదైనా చేయాలి అన్నారు. ఈ మాట ‘ఎన్టీఆర్-కథనాయకుడు' సినిమాలో కూడా అన్నగారి పాత్రతో చెప్పించారని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

ఖాళీ చేయాలని చెప్పారు
రాజకీయాల్లోకి వెళుతున్నట్లు అనౌన్స్ చేసి వచ్చిన తర్వాత నేను మళ్లీ అన్నగారిని వెళ్లి కలిశాను. ఆ సందర్భంగా నెల్లూరులో జరిగిన అవమానకర సంఘటన గురించి అన్నగారు గుర్తు చేసుకున్నారు. అన్నగారు అపుడు నెల్లూరు గెస్ట్ హౌస్లో ఉన్న సమయంలో అక్కడికి అర్దరాత్రి పూట మంత్రిగారు వచ్చారు. దీంతో అన్నగారిని వారు ఖాళీ చేయమన్నారు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కాబట్టి మంత్రికి ఇచ్చి తీరాలి. రెండు మూడు గంటలు అయితే తెల్లవారిపోతుంది వెళ్లిపోతాను అని చెప్పినా వినకుండా ఖాళీ చేయాల్సిందే అన్నారు.

ఘోరమైన అవమానం
మీరు ఎన్టీరామారావు కావొచ్చు ఆయన మంత్రి సార్ అని అక్కడి సిబ్బంది చెప్పారట. ఇంకా అక్కడ ఘోరమైన అవమానం జరిగింది. అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా మంది అభిమానులకు ఈ విషయం తెలుసు. ఆ రోజు వర్షం కూడా పడింది. అక్కడి నుంచి ఆయన బయల్దేరి వెళ్లిపోతూ ఒక మాట అన్నారు. ‘‘వస్తాను.. ఇదే గెస్ట్ హౌస్ కు వస్తాను.. నటుడుగానో మరో రకంగానో కాదు.. ముఖ్యమంత్రి రామారావుగా వస్తాను''. ఆయన చెప్పినట్లే ముఖ్యమంత్రి అయ్యాక నెల్లూరు వెళ్లినపుడు మొదట అదే గెస్ట్ హౌస్కు వెళ్లారు. మనం హీరోయిక్గా హీరో కథ రాసుకున్నపుడు రాస్తాం.. అలాంటి అద్భుతం నిజంగానే ఆయన జీవితంలో జరిగింది.
తెలుగు జాతి గౌరవం కోసం పోరాడటానికి కారణమైంది
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడేలేదు. ఒక రైలు నుంచి మహాత్మాగాంధీని నెట్టివేస్తే జాతి గౌరవం ఎలా గుర్తుకు వచ్చిందో.. ఒక అర్దరాత్రి మంత్రి వచ్చాడని ఖాళీ చేయమంటే తెలుగు జాతి గౌరవం అన్నగారికి గుర్తుకు వచ్చింది. రామారావుగారే కాదు నేను ఉన్నా, మీరు ఉన్నా, ఎవరున్నా కూడా అర్దరాత్రి అలా ఖాళీ చేయించడం ధర్మం కాదు. ఆ సంఘటన కేవలం రామారావు కోసమే కాకుండా తెలుగు జాతి గౌరవం కోసం పోరాడటానికి కారణమైందని... పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications











