అరవింద సమేత... సగం త్రివిక్రమ్, సగం కొరటాల తీసినట్లు అనిపించిందట!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరుచూరి పలుకులు పేరుతో ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ తన తండ్రి విషయంలో పడ్డ ఆవేదనను గుర్తు చేసుకున్నారు. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ను చూస్తుంటే ఒక కన్ను ఆవేదన, ఒక కన్ను ఆనందం కనిపించింది. హరికృష్ణ మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని ఆయన వ్యాఖ్యానించారు

ఇక ఆ ఇంటి పెద్ద దిక్కు ఆయనే
కళ్యాణ్ రామ్ వేదిక మీద మాట్లాడుతుంటే ఈ కార్యక్రమాన్ని చివరిదాగా కూడగలమా? అన్నంత బాధ కలిగింది. కానీ ఆ నిబ్బరం తట్టుకున్నాడు. మీ అందరికీ తెలుసు జానకి రామ్, హరికృష్ణ ఇద్దరూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారని, ఇప్పటి నుండి ఆ ఇంటి పెద్ద కళ్యాణ్ రామ్. ఆ పెద్దరికం అతడి బాడీ లాంగ్వేజ్లో కనిపించింది. తండ్రి కోసం కొన్ని క్షణాలు అందరినీ నిలబెట్టే ముందు నాన్న ఒకసారి పైకొస్తావా అనగానే... నాకు హరికృష్ణ చిన్న రామయ్యను పిలుస్తున్నట్లు అనిపించింది.... అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

తారక్ను చూస్తుంటే చాలా బాధేసింది
కళ్యాణ్ రామ్ మాట్లాడుతున్నపుడు తారక్ తన్నుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటున్నాడు. అతడిని చూస్తున్న మనం ఏడుస్తున్నాం. ఇది నిజం. అభిమానులు నందమూరి వంశానికి ఒక వరం. ఆ వరాన్ని వాళ్ల నాన్నగారు తనకు గుర్తు చేశారు. నిజంగా ఒక తండ్రి కైవల్యం చెందిన తర్వాత కోలుకోవడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. కానీ వెంటనే తాతగారిలాగా... తండ్రి చెప్పినట్లు నిర్మాత నష్టపోకూడదని వెళ్లి సినిమాను పూర్తి చేశాడు... అని పరుచూరి చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ సగం, కొరటాల సగం తీశారా? అనిపించింది
అరవింద సమేత ట్రైలర్ చూస్తుంటే.... ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సగం, కొరటాల శివ సగం తీశారా? అనిపించింది. నిజానికి వాళ్లు అలా తీయరు... కానీ నాకు అలా అనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్న రామయ్య బాడీ లాంగ్వేజ్లోకి మారిపోయి అతడు ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో ఇటు ప్రేమ ఎంత బావుందో, మాస్కు నచ్చే వయొలెన్స్ అంతే గొప్పగా ఉంది.... అని పరుచూరి వ్యాఖ్యానించారు.

త్రివిక్రమ్ కత్తికి రెండు వైపులా పదును
త్రివిక్రమ్ శ్రీనివాస్ కత్తికి రెండు వైపులా పదును ఉంది అని ఈ సినిమాతో నిరూపించబడుతుందని విశ్వసిస్తున్నాను. అక్టోబర్ 11న సినిమా విడుదల తర్వాత ఈ సినిమా భారీ విజాయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.

అందులో కూడా ఇలాంటి ముగింపే
ఎన్టీఆర్ బృందావనంలో ‘ఒరిజినల్' అక్కడే ఉంది అని ఒక్క మాట చెప్పాడు... ఆ ఒక్క డైలాగుకే ప్రజలు ఎంతలా వెర్రెక్కి పోయి సినిమా చూశారో అందరికీ తెలుసు. ఇందులో ఒక మంచి ఎండింగ్ ఉంది. బాలకృష్ణ చేసిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వీటిలో కూడా అలాంటి ఎడింగులే ఇచ్చాం. ఇవన్నీ అందరూ బావుడాలనే కాన్సెప్టుతో వచ్చినవే.

హింసలో నుండి శాంతి... అదే అరవింద సమేత
చిన్నపుడు రెండు కోళ్లు పోట్లాడుతుంటే నేను వాటిని ఆపడానికి ప్రయత్నించేవాడిని. అయితే మా నాన్న వద్దు కొట్టుకోనివ్వరా అనేవాడు. ఎందుకు నాన్న అంటే రెండూ కొట్టుకుని ఏదో ఒకటి ఓడి పోతుంది... రేపటి నుండి గెలిచిన దాన్ని చూసి ఓడింది భయపడి పారిపోతుంది. ఈ గొడవ ఉండదు అనేవాడు. అదే హింసలో నుండి అహింస... ఫైనల్ గా శాంతి. హింసలో నుండి శాంతిని సాధించడం, సమానత్వాన్ని సాధించడం అనే ఒక అద్భుతమైన పాయింటుతో అరవింద సమేత సినిమా వస్తోంది.... అని పరుచూరి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











