రక్తం కారుతుంటే ఎన్టీఆర్ అలాగే.. అదే మొండితనం.. కళ్లు చెమర్చాయి..
Recommended Video

సినీ పరిశ్రమలో వరుస విజయాలతో, విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నందమూరి తారక రామారావుతో పోలీకలు చెబుతూ యంగ్ టైగర్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుదీర్గమైన సినీ జీవితంలోని అనుభవాలను, అనుభూతులను పరుచూరి పలుకులు అనే శీర్షికతో య్యూటూబ్ ద్వారా పంచుకొంటున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్లోని మొండిధైర్యం జూనియర్ ఎన్టీఆర్కు వచ్చింది అని పరుచూరి చెప్పారు.

ఆది సినిమాకు డైలాగ్స్
తారక్ హీరోగా నటించిన ఆది సినిమాకు డైలాగ్స్ రాయమని నన్ను అడిగారు. అప్పుడు సమయం లేదనే కారణంతో రాయను అని చెప్పాను. కానీ మరోసారి వచ్చి అడుగగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆది చిత్రానికి మాటలు రాశాను. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలుసు కాద అని పరుచూరి అన్నారు.

బాలకృష్ణ స్కిప్టా అని
ఆది సినిమాకు డైలాగ్స్ రాయడం పూర్తయిన తర్వాత నా కూతురుకు వినిపించాను. ఆ డైలాగ్స్ విన్న నా కూతురు ఇది బాలకృష్ణ సినిమా స్క్రిప్టులాగా ఉంది. తారక్ ఆ పాత్రకు సరిపోతాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.

నందమూరి రక్తంలోనే ఉంది
నందమూరి తారక రామారావు వంశంలో ఎవరు చెప్పినా ఆ డైలాగ్స్ పేలుతాయి. ఆ రక్తంలోనే ఉంది ఆ పవర్ అని నా కూతురుకు చెప్పాను. నేను చెప్పినట్టే ఆది సినిమాలో డైలాగ్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి అని పరుచూరి అన్నారు.

తారక్ పట్టుదల మాటల్లో
జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల మాటల్లో చెప్పలేం. నటన పట్ల ఆయనకు ఉన్న ఆరాధన తాను ఏ యువ నటుల్లో చూడలేదు. వైజాగ్లో ఆది సినిమా క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో తారక్ చేతికి అద్దాలు గుచ్చుకొన్నాయి. అయితే సినిమా షూటింగ్ ఆగిపోతుంది అని అనుకొన్నాను.

చేతికి గాయమైనా అలానే
కానీ చేతికి గాయమై రక్తం కారుతున్నా తారక్ అలానే చేసేశారు అని యూనిట్ సభ్యులు చెప్పడంతో నేను కంగుతిన్నాను. వెంటనే నాకు అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షూటింగ్ను ఆపడానికి ఎన్టీఆర్ ఇష్టపడేవాడు కాదు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

సర్దార్ పాపారాయుడు షూటింగ్లో
సర్దార్ పాపారాయుడు సినిమా క్లైమాక్స్లో అన్నగారి చేతికి గాయమైంది. కానీ ఆయన అలాగే బాధతోనే నటించాడు. షూటింగ్ మాత్రం ఆగలేదు. తాత మొండితనమే జూనియర్ ఎన్టీఆర్కు వచ్చింది అని అప్పుడే అర్థమైంది అని పరుచూరి వెల్లడించారు.

ఎన్టీఆర్ అలా పిలువగానే..
ఆదికి సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతున్నది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పక్కకు తీసుకెళ్లాడు. మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా అని అడిగాడు. అప్పుడు నాకు కళ్లు చెమర్చాయి. పెదనాన్న అని పిలువమని చెప్పాను. అందరి ముందు అలా తారక్ పిలువగానే భావోద్వేగానికి లోనయ్యా. ఇప్పటికీ నన్ను అలానే పిలుస్తుంటాడు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పాడు.


Click it and Unblock the Notifications











