మంచివాళ్లు తక్కువైపోతున్నారు, పవన్ కళ్యాణ్కు ఆ పరిస్థితి రావొద్దు: పరుచూరి కామెంట్
పరుచూరి పలుకులు పేరుతో తన మనసులోని భావాలను వెల్లడించే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన కామెంట్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన పవన్ కళ్యాణ్ వల్ల భవిష్యత్తులో ఈ సమాజానికి జరుగబోయే మేలు ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక నిబద్దతతో 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2014లో తను ఏ పదవిని ఆశించకుండా తెలుగు దేశం, బీజేపీని సపోర్ట్ చేస్తూ తిరిగారు. మొన్న నర్మగర్బంగా ఓ మాట మాట్లాడారు. నేను కోరుకుని ఉంటే రాజ్యసభలో ఉండే వాన్ని అని... ఆయనకు ఆఫర్ వచ్చినా తీసుకోలేదని ఆ మాటతో మనకు అర్థమైంది అని పరుచూరి గుర్తు చేశారు.

ఆయనకు ఆ పరిస్థితి రాకూడదు
అతను పదవుల కోసం రాలేదు, భీమవరంలో తాను ఓడిపోయిన తర్వాత మాట్లాడిన దాంట్లో ‘నేను ఈ రోజో, రేపో ఉండి పోవడానికి మాత్రమే రాలేదు... నన్ను మీలో నలుగురు మోసుకెళ్లే వరకు నేను ఈ రాజకీయాల్లో ఉంటాను' అన్నారు. ఆయనకు ఆ పరిస్థితి రాకూడదు, నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు పరుచూరి పేర్కొన్నారు.

అలా కోరుకునే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.
నేను బావుండాలి అని ప్రతి వాడు కోరుకుంటారు. సమాజం బావుండాలని చాలా కొద్ది మంది కోరుకుంటారు. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. మనం గెలిచినపుడు మన వాళ్లు ఎవరో తెలియదు. మనం ఓడిపోయినపుడు మన వాళ్లు ఎవరో తెలుస్తుంది. ఇపుడు లాంటి వారు ఎవరో ఆయనకు తెలిసిపోయింది. ఇపుడు ఆయన చుట్టూ నిజమైన జనసైనికులు ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో మంచి వాళ్లు తక్కువ అయిపోతున్నారు
ఒక బంతిని నేలకేసి కొడితే పైకి లేస్తుంది. ఆ లక్షణం పవన్ కళ్యాణ్లో ఉంది. తొక్కితే పైకి లేచే లక్షణం ఆయనది. ఒక సినిమా ప్లాప్ అయితే వెంటనే ఒక హిట్ సినిమా ఎలా చేయాలని ఆలోచించుకుని ఒక అద్భుతమైన హిట్టు అందించినట్లుగానే రాజకీయాల్లో కూడా ఆయన సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే రాజకీయాల్లో మంచి వాళ్లు తక్కువ అయిపోతున్నారు. లేరని నేను అనడం లేదు. ఒకప్పుడు మంచి వారితో మాత్రమే రాజకీయ వ్యవస్థ నిండి ఉండేది. సమాజం బావుండాలని చెప్పే అతికొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఒకరు కాబట్టి ఆయన నిలబడాలని కోరుకుంటున్నట్లు పరుచూరి ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ ఆశయం ఒక అద్భుతం
పవన్ కళ్యాణ్ ఆశయం ఒక అద్భుతం, ఆయన జీవితం ఎక్కడ ఉందో తెలుసు. అద్భుతమైన, సుఖమైన, పంచభక్ష పరమాన్నాలు తినే జీవితం వదులుకుని ప్రజల్లో కూర్చుని తింటున్నావు. అన్నగారు, రాజశేఖర్ రెడ్డిగారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అలాగే తిరిగారు. అలా పాదయాత్రలు చేసుకుంటూ లోనికి వెళితేనే మన మనసులో ఉన్న మాట జనాలకు అందుతుంది. నువ్వు జనాన్ని కలవాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. అలా కలుస్తూ నువ్వు గెలిస్తే ఏమిటి? అనేది ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని మా లాంటి వారు ఎందరో కోరుకుంటున్నారు. అందుకే ఈ పుట్టినరోజు సందర్భంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నట్లు పరుచూరి తెలిపారు.


Click it and Unblock the Notifications











