కృష్ణగారి ఫ్యాన్స్ మా బుగ్గలు కొరికారు, మరిచిపోలేం: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి పలుకులు కార్యక్రమంలో ఈ వారం సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రస్తావించారు.
'పరుచూరి పలుకులు' పేరుతో తన సినీ ప్రస్తానంలోని అనుభవాలను వీడియోల రూపంలో విడుదల చేస్తున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి తన తాజా వీడియోలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
తమ జన్మలో మరిచిపోలేని వ్యక్తుల్లో కృష్ణగారు ఒకరని, ఇండస్ట్రీలో తమకు చేయూత నిచ్చిన మహానుభావుడు ఆయన అంటూ... పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాలను నెమరువేసుకున్నారు.

ఘోస్ట్ రైటర్గా పని చేశా
80ల్లో కృష్ణ గారు నటించిన ‘పగబట్టిన సింహం', ‘బంగారుభూమి' చిత్రాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేను. కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన ‘బంగారుభూమి'లో ఓ సన్నివేశానికి ‘పద్మా, మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. అదే, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు' అనే డైలాగ్ కృష్ణగారికి బాగా నచ్చింది. ఈ డైలాగ్ రాసింది ఎవరు అని ఆయన సెట్లో అడిగితే ఎవరూ చెప్పలేదట....తర్వాత మళ్లీ అడిగి మేము రాసిన విషయాన్ని తెలుసుకున్నారు... అని గోపాలకృష్ణ తెలిపారు.

8 సినిమాలకు రాసే అవకాశం ఇచ్చారు
ఆ డైలాగ్ కృష్ణగారికి ఎంతో నచ్చడంతో ఎనిమిది సినిమాలకు మాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. అన్న ఎన్టీఆర్ గారు మాకు పరుచూరి బ్రదర్స్ అని పేరుపెట్టి ఆశీర్వదిస్తే, మాకు చేయూత నిచ్చి ఆశీర్వదించింది కృష్ణ గారు. ఆయన్ని ఈ జన్మలో మర్చిపోలేమని గోపాలకృష్ణ అన్నారు.

మేము రాసిన బెస్ట్ డైలాగ్స్
సూపర్ స్టార్ కృష్ణ గారి 200వ చిత్రం ‘ఈనాడు'. పరుచూరి బ్రదర్స్ రాసిన బెస్ట్ డైలాగ్స్ ఏవీ అంటే ‘ఈనాడు' సినిమా అని మేము ఇప్పటికీ చెబుతాం మలయాళం రీమేక్ అయిన ఈ సినిమాలో శ్రీధర్ని హీరోగా పెడదామని కృష్ణగారు అన్నారు, ఆ క్యారెక్టర్కు ఆయన సరిపోరు అంటే మాదాల రంగారావు గారిని హీరోగా పెడదామా? అని అడిగారు... వారెవరూ కాదు సార్, మీరే హీరోగా నటించాలి అని మేము సూచించడంతో కృష్ణ గారు నవ్వేశారు... అని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

హీరోయిన్, డ్యూయెట్లు లేక పోవడంతో తటపటాయించారు
‘ఈనాడు' సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు ఉండవు, లవ్ సీన్లు ఉండవు, ఫైట్లు ఉండవు ఈ పాత్ర నేనెలా వేస్తా... అని కృష్ణగారు కాస్త సంకోచించారు. మీరు నటిస్తే ఓ చరిత్ర సృష్టిస్తుందని మేము చెప్పాం. కథను ఆయన వయసుకు తగిన విధంగా, సామాజిక అశాన్ని జోడించి... డైలాగులు కూడా ఆయనకు నచ్చే విధంగా రాయడంతో ఒప్పేసుకున్నారు.... అని గోపాలకృష్ణ తెలిపారు.

కృష్ణగారు భయపడ్డారు
1982 జనవరిలో ‘ఈనాడు' సినిమా విడుదలైంది. పండగ సీజన్ కావడంతో ఇతర హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నింటిలో డ్యూయెట్లు, ఫైట్లు.. ఉన్నాయి. ‘ఈనాడు'లో మాత్రం లేవు'. దీంతో, ఈ సినిమా నిలదొక్కుకుంటుందా అని కొంచెం కృష్ణ గారు భయపడ్డారు' అని గోపాలకృష్ణ అన్నారు.

ఒత్తిడి చేసి చేయించారు... అంటూ కండీషన్ పెట్టారు
‘గోపాలకృష్ణ గారూ.... మీరు, అన్నయ్య ఒత్తిడి చేసి నాతో ‘ఈనాడు' సినిమా చేయించారు. మిగిలిన హీరోల సినిమాల్లో డ్యూయెట్లు ఉన్నాయి. నా సినిమాలో లేవు. ‘ఈనాడు' విడుదల రోజున విజయవాడలో నాతో పాటు మీరు కూడా ఈ సినిమా చూడాలి' అనే కండీషన్ ని కృష్ణ గారు పెట్టారు. ఆయనతో పాటు మేము కూడా సినిమా చూడాల్సి వచ్చింది అని గోపాలకృష్ణ తెలిపారు.

అద్భుతమైన స్పందన వచ్చింది
‘మేము ఊహించినట్లే ‘ఈనాడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పుడు కృష్ణ గారు ‘మీరు చెప్పింది కరెక్టు' అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు' అని గోపాలకృష్ణ తెలిపారు.

ఫ్యాన్స్ బుగ్గలు కొరికేశారు
‘ఈనాడు' సినిమాలో డైలాగ్స్ బాగున్నాయంటూ కృష్ణ ఫ్యాన్స్ నా బుగ్గలు కూడా కొరికేశారు. ఆ సంగతి నేను మర్చిపోలేను. అప్పట్లో ఆ సినిమా చరిత్ర సృష్టించింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











