పవన్కు పాలాభిషేకం, కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం రగడ కొనసాగుతోంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో చిత్ర దర్శకుడు, నిర్మాతలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో పవన్ అభిమానులు, తెలంగాణలో నేతలు ఈ సినిమాపై సోమవారం కూడా ఘాటుగా స్పందించారు.
నిర్మాత దానయ్యను, దర్శకుడు పూరీ జగన్నాథ్ను తెలంగాణలో తిరగనీయొద్దని నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని కించపర్చవిధంగా తీసిని ..రాంబాబు చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలను దహనం చేసి, బుద్ధి చెప్పినా కాంగ్రెసు ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రి, డిజిపి, మంత్రులు ఉన్నంత కాలం మీడియా, సినిమాల్లో తెలంగాణపై దాడులు జరుగుతూనే ఉంటాయని ఘాటుగా విమర్శించారు.
మరోవైపు సీమాంధ్ర ప్రాంతంలో పవన్ అభిమానులు తెలంగాణ ప్రాంతంలో... రాంబాబు చిత్రంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఇంకా మండిపడుతున్నారు. తమ హీరో చిత్రాన్ని అడ్డుకుంటే సహించేది లేదని అభిమాన సంఘాలు హెచ్చరించాయి. కడప జిల్లా రైల్వేకోడురులో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మతో పవన్, చిరంజీవి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి దగ్ధం చేశారు. అనంతరం పవన్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.


Click it and Unblock the Notifications











