ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఎమోషనల్!
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు కే వాసు ఇకలేరు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణం సినీ ప్రముఖులను తీవ్ర విషాదానికి గురిచేసింది.
ఆయన మరణంతో దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపం ప్రకటించారు. వాసు మృతికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేస్తూ..

దర్శకులు శ్రీ కే.వాసు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా శ్రీ వాసు గారిని మరచిపోలేం. చిరంజీవి గారు తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు.
శ్రీ కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైనది. తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. శ్రీ వాసు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.
దర్శకుడు కే వాసు మరణం వార్తను తెలుసుకొన్న చిరంజీవి దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తూ.. సీనియర్ దర్శకులు కె.వాసు గారు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో చేసిన ప్రాణం ఖరీదు,తోడుదొంగలు , అల్లుళ్లు వస్తున్నారు, కోతల రాయుడు చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని చిరంజీవి తెలిపారు.


Click it and Unblock the Notifications











