మెగా ఫ్యామిలీ నుంచి మరో మంత్రి, చంద్రబాబు కేబినెట్లోకి నాగబాబు.. ఏ శాఖ ఇవ్వనున్నారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది తిరుగులేని సంవత్సరంగా నిలిచిపోయింది. దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా దూసుకెళ్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కావడంతో ఇంటా బయటా పవన్ శాసించే స్థితిలో ఉన్నారు. ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మెగా ఫ్యామిలీకి , అభిమానులకు మరో శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పవన్ చిన్న అన్నయ్య నాగబాబుని కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు ప్రాణాలిస్తారు. తమ్ముడిపై ఆయన ఈగ వాలనివ్వరు. రాజకీయాలపై తొలి నుంచి అవగాహన ఉండటంతో పాటు కాపు సామాజికవర్గం, చిరంజీవి అభిమాన సంఘాలతో నాగబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేడర్ను నడిపించారు నాగబాబు. ఈ నేపథ్యంలోనే ఆయనను జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో టీడీపీ , బీజేపీలతో పొత్తు ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక, పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే వ్యవహారాలు నాగబాబు పర్యవేక్షించారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం నాగబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో తొలి నుంచి తనకు అండగా నిలిచి, కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న తన సోదరుడు నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఏ రకంగా న్యాయం చేస్తారోనని జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజానికి లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయాల్సింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆ సీటు కావాలని పట్టుబట్టడంతో పవన్ విజ్ఞప్తి మేరకు నాగబాబు పోటీ నుంచి తప్పుకుని త్యాగం చేశారు.
నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది కానీ అది గాలి వార్తలేనని తేలింది. అనంతరం ఎమ్మెల్సీల భర్తీ సమయంలోనూ నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. కీలకమైన టీటీడీ ఛైర్మన్ రేసులోనూ నాగబాబు పేరు వినిపించింది. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని.. తన ఒంట్లో ఓపిక, ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని నాగబాబు స్పష్టం చేశారు. అయితే అన్నయ్యకి ఎలాగైనా న్యాయం చేయాలని పవన్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగా రాజ్యసభ కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బీజేపీకి వేరే లెక్కలు ఉండటంతో పవన్ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించిన పవన్ .. చంద్రబాబును ఒప్పించి నాగబాబును కేబినెట్లోకి తీసుకునేలా చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన చేయగా.. త్వరలోనే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మూడో మంత్రిగా నాగబాబు నిలిచారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి మన్మోహన్ సింగ్ కేబినెట్లో టూరిజం శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం వపన్ కళ్యాణ్.. చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగబాబు కూడా తన సోదరుల సరసన నిలిచారు.
ఏపీ మంత్రి వర్గంలో 25 మంది వరకు తీసుకునే వీలుండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే పవన్, కందుల దుర్గేష్ , నాదెండ్ల మనోహర్లు మంత్రులుగా ఉండగా మరో పోర్ట్ఫోలియా రావాల్సి ఉండగా అది నాగబాబుకు కేటాయించారు చంద్రబాబు. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. నాగబాబుకు సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాల దృష్ట్యా సినిమాటోగ్రఫీ లేదా టూరిజం శాఖ దక్కే అవకాశాలు వున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











