CBN Arrest వైసీపీ నేతలు అక్రమాలు చేసి జైళ్లకు.. విదేశాలకు వెళ్లొచ్చు.. చంద్రబాబు అరెస్ట్పై పవన్ కల్యాణ్ ఫైర్
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కారణమని ఆయన ఆరోపించారు.
నంద్యాలలో అర్ధరాత్రి హైడ్రామా అనంతరం ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసే విధానం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. గతేడాది అక్టోబర్లో విశాఖపట్నంలో మా పార్టీ పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ చూశారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో గుర్తు చేశారు. ఇంకా చంద్రబాబు అరెస్ట్పై స్పందిస్తూ..

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పట్ల నంద్యాలలో ఏపీ ప్రభుత్వం అవలంభించిన విధానం కూడా అలానే ఉంది. చంద్రబాబు అరెస్ట్ను సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఈ అరెస్ట్ అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతున్నది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని జనసేన భావిస్తుంది. ప్రతిపక్షాలను అణిచివేయాలనే వైసీపీ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో అన్నారు.
చిత్తూరు, నంద్యాలలో చంద్రబాబు నాయుడు పట్ల అవలంభించిన తీరు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులు, వైసీపీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు అని నేతలు చెప్పడం దేనికి సంకేతం. లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది కదా. వైసీపీ నేతలకు సంబంధం ఏమిటి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. వైసీపీ వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నదని ఆరోపించారు.
రాజకీయాల్లో ఓ పార్టీ అధినేత అరెస్ట్ అయితే వారి కార్యకర్తుల బయటకు వచ్చి నిరసన తెలియజేయడం కొత్త కాదు. తమ నాయకుడికి మద్దతుగా నిరసన తెలియజేయవద్దని ఆంక్షుల విధిస్తే ఎలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు అక్రమాలు, దోపిడిలు చేసి జైళ్లకు వెళ్తారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్లొచ్చు. ఏ తప్పు చేయకపోయినా పార్టీ నేతలు బయటకు రావొద్దు అనడం భావ్యమా? చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యలో భాగమే. ఆయన అరెస్ట్ను ఖండిస్తూ.. జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని తెలిసింది. అరెస్ట్ అయిన చంద్రబాబును పరామర్శించి.. ఆయనకు సంఘీభావంగా ప్రకటించేందుకు విజయవాడ వెళ్లనున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











